09-11-2025 07:45:45 PM
బోథ్ (విజయక్రాంతి): బోథ్ మండలంలోని మర్లపల్లి గ్రామంలో ఆదివారం ఉదయం ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం సంభవించి ఇందూరు మహేష్ అనే వ్యక్తికి చెందిన ఇల్లు పూర్తిగా కాలిపోయింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం ఉదయం మహేష్ కుటుంబీకులు ఉదయం పూజానంతరం ఇంట్లో దీపం వెలిగించారు. ఆదివారం కావడం చేత తమ కూతురు గురుకులంలో చదువుతుండగా చూడడానికని కుటుంబ సమేతంగా ఇంటికి తాళం వేసి వెళ్లారు. మధ్యాహ్న సమయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగి దహనంలో వ్యాపించి ఇల్లంతా దగ్ధమైంది.
చుట్టుపక్కల వాళ్లు తేరుకొని మంటలార్పే ప్రయత్నం చేసినప్పటికీ లాభం లేకపోయింది. అప్పటికే జరగరాని నష్టం జరిగిపోయింది. ఫైర్ ఇంజన్ కు సమాచారం ఇచ్చినప్పటికీ అది ఇచ్చోడ నుండి వచ్చేలోగా ఇల్లు కాస్త కాలి బూడిదయింది. ఇంట్లో విలువైన పత్రాలు పాస్పోర్ట్ ఉన్నాయని లక్షల్లో ఆస్తి నష్టం సంభవించిందని కుటుంబ సభ్యులు లబోదిబోమంటున్నారు. అసలే పేదరికంతో కొట్టుమిట్టాడుతున్న బాధిత కుటుంబానికి ఉన్న కాస్త గూడు కూడా అగ్నికి ఆహుతి కావడంతో బాధిత కుటుంబం రోడ్డున పడింది. ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు వేడుకుంటున్నాడు. కాగా ఆస్తి నష్టంపై రెవెన్యూ అధికారులు అంచనా వేయాల్సి ఉంది.