02-05-2025 12:00:00 AM
వేసవి తన ప్రతాపాన్ని చూపిస్తున్నది. ఉదయం 8 గంటలు అవడంతోనే భానుడు నడినెత్తి కొచ్చిన మంటవలె మండుతున్నాడు. రోడ్డుమీదికి వచ్చే వారికి పొయ్యిలోకి వచ్చిపడ్డట్టు అనిపిస్తున్నది. మానవులం మనకే ఇంత అవశమై పోతుంటే, నోరు లేని జీవుల పరిస్థితి అత్యంత దయనీయం. కాల్వలు, నదులు, భూగర్భ ఊటలు ఎండిపోతుంటే, సాగరజలాలన్నీ వేడెక్కిపోతున్నాయి. జలచరాలకు నిజంగా నరకమే. గగనతలంలో ఎగిరే పక్షుల పరిస్థితి తలచుకుంటేనే భయమేస్తుంది.
పశుపక్షులు, జంతుజాలం, ఇతరేతర అనేక జీవజాతులు ఆహారం కోసం అల్లాడి పోతున్నాయి. వడగాల్పులు దేహంలో జీవాల్ని హరిస్తున్నాయి. పూలన్నీ వాడి మొక్కలను వీడి నేలపై పడుతున్నాయి. చెట్ల ఆకులు మంట తాల లేక ఎండి నేలరాలుతున్నాయి. ఉపరితలంపై వీస్తున్న వేడి వాయువులను తట్టుకొనే పరిస్థితే లేదు. ఈ నెల అంతా ఎలా గడుస్తుందో అన్న దిగులు పట్టుకుంది. చినుకుల కోసం ఎదురు చూడడం తప్ప మనం మరేం చేయగలం!
-సుంకవల్లి సత్తిరాజు, సంగాయిగూడెం
అందాల పోటీలు అవసరమా?
ఈనెల 7 నుండి 31 వరకు హైదరాబాద్లో 72వ మిస్ వరల్డ్ పోటీలు జరుగనున్నాయి. వీటిలో పాల్గొనడానికి 140కి పైగా దేశాల నుంచి యువతులు రానున్నారని వార్తలు వచ్చాయి. తెలంగాణలోని చేనేత వారసత్వం, పర్యాటక ప్రదేశాలు, ప్రత్యేక వంటకాలు ప్రదర్శించడానికి అందాల పోటీలు నిర్వహించడం విచిత్రంగా ఉంది. సాంస్కృతిక సమావేశాలు, ఫొటో ప్రదర్శనలు, విదేశీయులను ఆహ్వానించి కూడా తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి తెలియజేయవచ్చు.
అందాల పోటీల పేరుతో శారీరక ప్రదర్శన చేస్తూ, మహిళలను ఊరేగించి తీర్పు చెప్పడం అభ్యంతరకరం. ఇది మహిళా జాతికి అవమానకరం. మహిళలను వ్యాపార సరుకుగా మార్చేయడం దారుణం. సౌందర్య ప్రదర్శనలతో మహిళల సాధికారతకు గుర్తింపు లభిస్తుందా? స్త్రీలు వారి మేధస్సు, పనిలో అంకితభావం, సామాజిక సేవ వంటివాటికి అంకితమై పనిచేసేలా ప్రభుత్వాలు ప్రోత్సహించాలి. అంతేకానీ, ఇలాంటి అవాంఛనీయ సంస్కృతికి తెర తీయడం అభ్యంతరకరం.
- ఆళవందార్ వేణుమాధవ్, హైదరాబాద్
వేసవి సెలవుల సద్వినియోగం
స్కూళ్లు, కాలేజీలకు లభించే వేసవి సెలవులను పిల్లలు సద్వినియోగం చేసుకునేలా తల్లిదండ్రులు చూడాలి. ఊరికే సమయం వృ థా చేయడం వల్ల నష్టమే తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదు. చదువులో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు చెప్పించడం ద్వా రా వచ్చే విద్యా సంవత్సరం వరకూ వారిని సంసిద్ధులను చేసే అవకాశం ఉంటుంది. లభ్యమైన ఈ కాలాన్ని ఆటవిడుపు కోసమే కాకుం డా కొంత విజ్ఞానదాయకంగానూ మార్చుకోగలిగితే బావుంటుంది.
-డా.బుర్ర మధుసూదన్రెడ్డి, కరీంనగర్