పుణ్యానికి పోతే... పాపం ఎదురయింది
- జవహర్ నగర్ లో దారిదోపిడీ
- లిఫ్ట్ పేరిట బైక్ ఆపి నగదు అపహరణ
జవహర్ నగర్, ఆగస్టు 1 (విజయక్రాంతి): పుణ్యానికి పోతే పాపం ఎదుర య్యింది. లిఫ్ట్ అడిగి బైక్ ఎక్కిన ఓ వ్యక్తి, మరికొందరితో కలసి ఓ వ్యక్తిని బెదిరించి నగదు, ఆన్లైన్ బదిలీ ద్వారా సొమ్ము గుంజిన సంఘటన జవహర్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది.జవహర్ నగర్ ఎస్ హెచ్ ఓ సైదులు తెలిపిన వివరాల ప్రకారం... కీసరలోని వీకర్ సెక్షన్ కాలనీకి చెందిన ఆవుల పద్మారావు (52) జులై 31వ తేదీ రాత్రి సుమారు 7:45 గంటల సమయంలో చిన్న పని నిమిత్తం జవహర్ నగర్ లోని అంబేద్కర్ నగర్కు వెళ్లారు.
పని ముగించుకుని తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమంలో అంబేద్కర్ నగర్ బోర్డు సమీపంలో సుమారు 23 ఏళ్ల వయస్సు గల ఓ గుర్తుతెలియని యువకుడు ఆయనను లిఫ్ట్ అడిగాడు.మానవత్వంతో పద్మారావు సదరు యువకుని బ్పై ఎక్కించుకోగా, కొద్ది దూరం వెళ్లాక ఆ యువకుడు బైక్ను సమీపంలోని ఒక సందులోకి తీసుకువెళ్లాడు. వెంటనే అక్కడికి మరికొందరు వ్యక్తులు చేరుకుని పద్మారావు బైక్ను అడ్డుకున్నారు. ఆయనను బలవంతంగా లోపలికి తీసుకెళ్లి భయభ్రాంతులకు గురిచేశారు. ఈ మేరకు బాధితుని వద్ద ఉన్న రు.నాలుగువేల నగదు ను లాక్కున్నారు. అంతేకాకుండా ఆయన మొబైల్ ఫోన్ నుండి మరొకరి ఖాతాకు రూ. ఎనిమిది వందలు ఫోన్ పే ద్వారా ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు.
ఈ విషయం బయటకు చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరిస్తూ నిందితులు అక్కడి నుండి పరారయ్యారు.బాధితుడు పద్మారావు ఫిర్యాదు మేరకు జవహర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటా మని పోలీసులు వెల్లడించారు.






