31-05-2025 02:29:49 AM
హైదరాబాద్, మే 30 (విజయక్రాంతి): ఆర్టీసీ కార్మికుల ప్రధాన సమస్యలపై జూన్ 2 లోపు సీఎం రేవంత్రెడ్డితో చర్చిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ జేఏసీ నాయకులకు హామీ ఇచ్చారు. శుక్రవారం ఉదయం ఆర్టీసీ జేఏసీ నాయకులు మినిస్టర్ క్వార్టర్స్లో మంత్రి పొన్నంతో భేటీ అయ్యారు. ప్రభుత్వమిచ్చిన హామీ మేరకు తాము సమ్మె వాయిదా వేసుకున్నామని, ప్రభుత్వం సైతం స్పందించి తమ సమస్యలు తీర్చాలని విజ్ఞప్తి చేశారు. సమ్మె వాయిదా వేసి చాలా రోజులైనా, నేటికీ స్పందన రాలేదని వారు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
మరోవైపు తాము ప్రభుత్వం సూచనతో సమ్మె విరమిస్తే, ఆర్టీసీ యాజమాన్యం మాత్రం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ వెల్ఫేర్ కమిటీల రాష్ట్రస్థాయి సమావేశాన్ని నిర్వహించి, తమ మనోభావాలను దెబ్బతీసిందని మంత్రికి ఫిర్యాదు చేశారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలపై సీఎం సానుకూలంగా ఉన్నారని, ఖచ్చితంగా ఆయనతో మాట్లాడి జూన్ 2 లోపల సమస్యలపై చర్చిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
ముఖ్యమంత్రితో మాట్లాడిన తర్వాత జేఏసీ నాయకులను కూడా త్వరలో పిలిపించి సమస్యలు పరిష్కరించే విధంగా ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చినట్టు జేఏసీ నాయకులు తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న, జేఏసీ కో చైర్మన్ హనుమంతు, వైస్ చైర్మన్ థామస్ రెడ్డి, కో కన్వీనర్ కత్తుల యాదయ్య, సుద్దాల సురేశ్, పాల్, కమలాకర్ గౌడ్, యాదయ్య ఏఆర్రెడ్డి, జీ రాములు, మజీద్, రాంచందర్ తదితరులు ఉన్నారు.