25 March, 2026 | 2:10 AM

బ్యాండ్ మేళం నచ్చకపోతే ఇక నా సినిమా చూడకండి

25-03-2026 12:00 AM

‘కోర్ట్’తో బ్లాక్‌బస్టర్ పెయిర్‌గా నిలిచిన హర్ష్ రోషన్, శ్రీదేవీ జంట మళ్లీ ‘బ్యాండ్ మేళం’ అంటూ ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ సినీ రచయిత కోన వెంకట్ నిర్మాణ సారథ్యంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంది. కావ్య, శ్రావ్య నిర్మాతలు. సతీశ్ జవ్వాజీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను మార్చి 26న విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు స్టార్ రైటర్ విజయేంద్రప్రసాద్, ప్రముఖ దర్శకులు వీవీ వినాయక్, బాబీ, నటుడు, నిర్మాత బండ్ల గణేశ్, గీత రచయిత చంద్రబోస్, హీరో శ్రీవిష్ణు, ప్రముఖ నిర్మాత సురేశ్‌బాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా కోన వెంకట్ మాట్లాడుతూ.. “సతీశ్ చెప్పిన కథ విన్న తర్వాత రోషన్, శ్రీదేవీ అయితేనే పర్‌ఫెక్ట్‌గా ఉంటారని అనుకున్నా. ‘బ్యాండ్ మేళం’ నా కోసం చూడండి. నచ్చకపోతే ఇంకోసారి నేను రాసిన సినిమాని చూడకండి. ఈ మూవీ క్లైమాక్స్ అందరినీ కదిలిస్తుంది. ఈ చిత్రం జీవితాంతం గుర్తుంటుంది” అని చెప్పారు. డైరెక్టర్ సతీశ్ జవ్వాజి మాట్లాడుతూ.. “నేను అవకాశాల కోసం చాలా ఆఫీసుల చుట్టూ తిరిగి ఎంతో ఏడ్చాను.

కానీ మా ‘బ్యాండ్ మేళం’ ప్రీమియర్ చూసిన తర్వాత అందరూ ఏడ్చారు. క్లైమాక్స్ టైమ్‌లో నేను కచ్చితంగా ప్రేక్షకులకు గుర్తుకు వస్తా” అని తెలిపారు. ‘ఈ యాదగిరి అందరినీ నవ్విస్తాడు, ఏడ్పిస్తాడు’ అని చిత్ర కథానాయకుడు హర్ష్ రోషన్ అన్నారు. కథానాయకి శ్రీదేవి మాట్లాడుతూ.. “క్లైమాక్స్ నాకు చాలా నచ్చింది. యాదగిరి, రాజమ్మ పాత్రలు అందరికీ నచ్చుతాయి” అని తెలిపింది.

నిర్మాత శ్రావ్య మాట్లాడుతూ.. “నా పేరు శ్రావ్య. కోన వెంకట్ కూతురిని. ‘బ్యాండ్ మేళం’ సినిమాను అందరితో కలిసి మార్చి 26న వీక్షించాలని కోరుకుంటున్నా” అని తెలిపింది. సంగీత దర్శకుడు విజయ్ బుల్గానిన్, ‘కోర్ట్’ నిర్మాత దీప్తి, ‘కోర్ట్’ దర్శకుడు రామ్ జగదీశ్‌తోపాటు మిగతా అతిథులు, చిత్రబృందం కూడా ఈ కార్యక్రమంలో మాట్లాడారు.