15-06-2025 12:15:49 AM
నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా...
మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి..
చెన్నూర్ (విజయక్రాంతి): అక్రమ దందాలను ఎట్టి పరిస్థితిలో సహించేది లేదని, నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతానని మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి(Minister Gaddam Vivek Venkataswamy) అన్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా నియోజకవర్గానికి విచ్చేసిన మంత్రి వివేక్ వెంకటస్వామికి జైపూర్ మండలం ఇందారం, రసూల్ పల్లి, జైపూర్, భీమారం, చెన్నూరులలో కాంగ్రెస్ నాయకులు బాణాసంచా కాల్చి మంత్రికి ఘన స్వాగతం పలికారు. డీజే సప్పుళ్లు, బ్యాండ్, డ్యాన్సులతో, భారీ గజమాలతో మంత్రిని సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరిపాలన అందించడమే నా కర్తవ్యమన్నారు.
నియోజక వర్గంలో ఇప్పటి వరకు ఎక్కడ కూడా అవినీతి లేకుండా అభివృద్ధి చేశానని, ఇకముందు ఇదే కొనసాగుతుందన్నారు. అవకతవకలు లేకుండా, అక్రమాలు లేకుండా అభివృధి చేస్తానని, మీరు కోరిన విధంగానే ఇసుక దందా బంద్ చేయించి చూపానన్నారు. అందుకే నాకు మైనింగ్ మంత్రిగా ఇవ్వడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రభుత్వ నియమ నిబంధనలు ప్రకారం ఇసుక క్వారీలు నిర్వహించేల చూస్తానన్నారు. గత ప్రభుత్వ హయాంలో కాంగ్రెస్ నాయకులపై అక్రమ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేశారన్నారు. నియోజక వర్గ అభివృద్ధి కోసం ప్రతీ గ్రామానికి రూ. 50 లక్షల నిధులతో అభివృద్ధి పనులు చేస్తున్నానన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఫ్రీ బస్, రూ. 500లకే గ్యాస్, ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం జరుగుతుందన్నారు. గత ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇస్తానని మోసం చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. విద్యపైన దృష్టి పెట్టీ సోమనపల్లిలో రూ. 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. జైపూర్, భీమారం మీదుగా చెన్నూర్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.