గిరిజన గ్రామాల విజన్ 2030లో సంక్షేమాభివృద్ధి పథకాల అమలు
కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ఆసిఫాబాద్ జిల్లా పరిధిలోని గిరిజనుల సంక్షేమ అభివృద్ధి కోసం గిరిజన గ్రామాల విజన్ 2030 కార్యక్రమాన్ని సమర్ధవంతంగా అమలు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ వెంకటేష్, దోత్రే అన్నారు. శుక్రవారం దేశ రాజధాని న్యూఢిల్లీలో గిరిజన అధికారుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఆది కర్మయోగి అభియాన్ కార్యక్రమంపై నిర్వహించిన జాతీయ సదస్సుకు హాజరై మాట్లాడారు. గిరిజన గ్రామాల విజన్ 2030 లో భాగంగా గిరిజనులకు అన్ని రకాల సంక్షేమ పథకాలను చేరువ చేసేందుకు, సమగ్ర అభివృద్ధి అందించేందుకు కృషి చేయడం జరుగుతుందని తెలిపారు.
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా లింబుగూడ ప్రాంతంలోని బహుళార్థక ప్రయోజన కేంద్రం ద్వారా అందిస్తున్న సేవలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. వాంకిడి మండలం కిరిడి గ్రామపంచాయతీ పరిధిలోని లింబుగూడలో గిరిజనుల అభివృద్ధి కొరకు బహుళార్థక ప్రయోజన కేంద్రాన్ని ఏర్పాటు చేసి సేవలు అందించడం జరుగుతుందని, ప్రధానమంత్రి జన్ మన్ పథకం ద్వారా పీవీటీజీలకు వైద్యం, విద్య, పౌష్టిక ఆహారం అందిస్తూ ఆరోగ్యవంతమైన జీవితాన్ని పొందేందుకు ప్రోత్సహించడం జరుగుతుందని తెలిపారు. ఆదివాసి కుటుంబాలకు అధునాతన పరికరాలతో నాణ్యమైన వైద్య సేవలు అందించడం జరుగుతుందని, 500 పైన గిరిజన కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయని తెలిపారు. గిరిజన పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలకు అవసరాలను సమకూర్చడం జరుగుతుందని తెలిపారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విద్యాబోధన అందించడం, ఉపాధి పొందేందుకు అవసరమైన శిక్షణను అందించి ప్రోత్సహించడం జరుగుతుందని తెలిపారు. శిక్షణ తరగతులు, సమావేశాలు, సాంస్కృతిక కూటములతో గిరిజనుల మధ్య సత్సంబంధాలను మెరుగుపరచడం, ఆదివాసి సంస్కృతికి అద్దం పట్టేలా చిత్రాలను రూపొందించడం, పురాతన లోహపు నైపుణ్యాన్ని ప్రదర్శించడం, సంప్రదాయ కళలు, గుస్సాడీ నృత్యం సంబంధిత వస్త్రాలు, వేషధారణ ప్రదర్శించడం జరుగుతుందని తెలిపారు. గిరిజనుల జీవితాలలో ఆధునికతకు స్థానం కల్పించడంతో పాటు సాంస్కృతిక కళలకు ప్రాధాన్యత అందించడం, జీవ వైవిధ్యాన్ని పెంపొందించడం జరుగుతుందని తెలిపారు. కొమురం భీమ్ ఆసిఫాబాద్ ఆదివాసి జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి చేసి దేశ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని కల్పించేందుకు అధికార యంత్రాంగం సమన్వయంతో కృషి చేస్తున్నామని తెలిపారు.






