calender_icon.png 1 July, 2025 | 8:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంగన్వాడీల జీతాల్లో వాటా పెంచండి

01-07-2025 02:52:14 AM

  1. అదనపు నిధులు మంజూరు చేయండి
  2. కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవికి మంత్రి సీతక్క విజ్ఞప్తి 

హైదరాబాద్, జూన్ 30 (విజయక్రాంతి): మహిళా, శిశు సంక్షేమ శాఖకు అదనపు నిధులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రి అన్నపూర్ణా దేవిని ఆ శాఖ రాష్ట్ర మంత్రి సీతక్క విజ్ఞప్తి చేశారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణాదేవితో మంత్రి సీతక్క భేటీ అయ్యారు.

మహారాష్ర్ట నుంచి ఢిల్లీకి తిరుగు ప్రయాణమైన కేంద్ర మంత్రి కాసేపు శంషాబాద్ విమానాశ్రయంలో ఉన్న క్రమంలో మహిళా సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్‌తో కలిసి మంత్రి సీతక్క పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క రాష్ర్టంలో అమల వుతున్న పథకాల వివరాలతో కూడిన వినతిపత్రాన్ని కేంద్ర మంత్రికి అందజేశారు.

ఆరోగ్యలక్ష్మి, పోషణ్ 2.0, సంక్షేమ అంగన్వాడీ వంటి పథకాల ద్వారా తెలంగాణలో మహిళా, శిశు సంక్షేమానికి ప్రభుత్వం అధిక నిధులు వెచ్చిస్తోందని ఆమె తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో లేని విధంగా అంగన్వాడీ ఉద్యోగులకు పదవీ విరమణ ప్రయోజనాలు కల్పిస్తున్న విషయాన్ని కేంద్ర మంత్రికి వివరించారు.

అలాగే అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల జీతాల్లో కేంద్ర వాటాను పెంచాలని కోరారు. అంగన్వాడీ టీచర్లకు, హెల్పర్లకు రాష్ర్ట ప్రభు త్వం నెలకు రూ.10,950, రూ.6,450 చెల్లిస్తుండగా కేంద్రం తన వాటాగా నామమాత్రంగా కేవలం రూ.2,700,  రూ.1,350 మాత్రమే చెల్లిస్తుందని, ఈ మొత్తాన్ని పెంచాల్సిన అవసరాన్ని కేంద్ర మంత్రికి సీతక్క వివరించారు.

దీంతోపాటు రాష్ర్టంలో 11 వేలకుపైగా అంగన్వాడీ కేంద్రాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయని, వాటికి సొంత భవనాల నిర్మాణానికి కేంద్రం నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆరోగ్య లక్ష్మి పథకం ద్వారా గర్భిణీలకు బాలింతలకు ప్రతిరోజు 200 ఎంఎల్ విజయ మిల్క్ ను అందిస్తున్నామని, త్వరలో చిన్నారులకు సైతం ఈ పథకాన్నిన్ని వర్తింపచేసే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని, కేంద్ర ప్రభుత్వం తన వంతు సహకారం అందించాలని మంత్రి సీతక్క కోరారు.

తెలంగాణలో జాతీయ సదస్సు

మంత్రి సీతక్క వినతులపై కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవి సానుకూలంగా స్పందించారు. తెలంగాణ చేపడుతున్న పథకాలు అభినందనీయమని ప్రశంసించారు. దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాల మహిళా శిశు సంక్షేమ మంత్రులు, అధికారులతో కలిసి తెలంగాణలో జాతీయ సదస్సు నిర్వహించి ఇక్కడి బెస్ట్ ప్రాక్టీస్‌ను ఇతర రాష్ట్రాలకు పరిచయం చేస్తామని కేంద్రమంత్రి తెలిపారు. కేంద్ర ప్రభుత్వంతో చర్చించి అధిక నిధుల మంజూరుపై నిర్ణయం తీసుకుంటామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు.