05-08-2025 12:00:00 AM
గీతం స్కూల్లో జాతీయ చర్చాగోష్ఠి ప్రారంభం
సంగారెడ్డి, ఆగస్టు 4 (విజయక్రాంతి)/పటాన్చెరు: భిన్నత్వంలో ఏకత్వంతో పాటు ఐక్యతకు చిహ్నం భారతదేశమని గవర్నర్ జిష్ణుదేవ్వర్మ అన్నారు. గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సెన్సైస్లోని రాజకీయ శాస్త్ర (పొలిటికల్ సైన్స్) విభాగం ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహించనున్న ‘సర్దార్ వల్లభాయ్ పటేల్, రైతులు చంపారన్ నుంచి చిత్రకూట్ వరకు జాతీయ చర్చాగోష్ఠిని సోమవారం ఆయన ప్రారంభించారు.
భారతీయ సామాజిక శాస్త్ర పరిశోధనా మండలి (ఐసీఎస్ఎస్ఆర్) సహకారంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ప్రారంభోత్సవంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మాట్లాడుతూ.. స్వాతంత్య్రం తర్వాత 562 సంస్థానాలను భారతదేశంలో విలీనం చేయడంలో సర్దార్ పటేల్ అద్భుతమైన పాత్రను వివరించారు. రైతు ఉద్యమాలకు పటేల్ చేసిన సేవలు అంతగా వెలుగులోకి రాలేదన్నారు.
చారిత్రాక వార్రోలి సత్యాగ్రహం (1928)లో పటేల్ నాయకత్వాన్ని, రైతులు, భూమిలేని కార్మికుల సాధికారత కోసం ఆయన చేసిన కృషిని గవర్నర్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. రైతులు, జాతీయ ఐక్యత పట్ల పబేల్ దృక్పథంపై ఈ చర్చాగోష్ఠిలో విలువైన చర్చలకు దారితీస్తుందని గవర్నర్ విశ్వాసం వ్యక్తం చేశారు. అంతకు ముందు మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించారు.
స్టాచ్యూ ఆఫ్ యూనిటీ విశిష్టతను గుజరాత్ ప్రభుత్వ ఇండెక్ట్స్- సీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఐఏఎస్ అధికారి డాక్టర్ సంజయ్ జోషి వివరించారు. ఐక్యతా స్ఫూర్తిని పొందడం కోసం గుజరాత్లో నెలకొల్పిన సర్దార్ పటేల్ స్మారక నివాళిని సందర్శించమని విద్యార్థులను జోషి ప్రోత్సహించారు. సామాజిక సమరస్థ మం జాతీయ కన్వీనర్ కె.శ్యామ్ ప్రసాద్ పటేల్ నాయకత్వం గురించి ప్రముఖంగా ప్రస్తావించడంతో పాటు ఆయనపై రాజ్ మోహన్ గాంధీ రచించిన పుస్తక ప్రతులను వేదికపైనున్న ప్రముఖులకు బహుకరించారు.
గీతం హైదరాబాద్ అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీఎస్రావు స్వాగతోపన్యాసంలో అతిథులను సభకు పరిచయం చేయడంతో పాటు గీతం పురోగతిని వివరించారు. వీరిలో గుజరాత్ లోని సర్దార్ పటేల్ విశ్వవిద్యాలయం చరిత్ర విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ వసంత్ కుమార్ ఆర్ పటేల్, తెలంగాణలోని ములుగులోని సమ్మక్క సారక్క గిరిజన కేంద్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వై.ఎల్.శ్రీనివాస్,
ఆంధ్రప్రదేశ్ కేంద్ర విశ్వవిద్యాలయం ఇన్-గ్రార్జ్ రిజిస్ట్రార్ అండ్ డీన్ ప్రొఫెసర్ షీలా రెడ్డి, హైదరాబాద్ విశ్వవిద్యాలయం సోషియాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్ జి.నాగరాజు, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ వంశీ కృష్ణారెడ్డి, ఐసీఎస్ఎస్ఆర్ దక్షిణ ప్రాంత డైరెక్టర్ ప్రొఫెసర్ సుధాకర్ రెడ్డి, యూజీసీ మాజీ సభ్యుడు ప్రొఫెసర్ జి.గోపాల్ రెడ్డి పాల్గొన్నారు.