నెలరోజుల్లో అర్హులకు ఇండ్లు ఇవ్వకపోతే ఆక్రమిస్తాం
సిపిఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి
ముకరంపుర,(విజయక్రాంతి): అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లును మంజూరు చేయాలని సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో కరీంనగర్ ఎమ్మార్వో రాజేష్ కు వినతి పత్రం ఇచ్చారు.ఈ సందర్భంగా నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి మాట్లాడుతూ... మండలంలోని అనేక గ్రామాల్లో ఇల్లు నిర్మించుకోవడానికి ఆర్థిక స్థోమత లేక సొంత స్థలం లేక వారు చిన్న గదుల్లోనే నివసిస్తున్న కుటుంబాలు ఉన్నాయని, ప్రభుత్వ భూములను గుర్తించి అర్హులైన నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందని అన్నారు.
చాలామందికి ఇండ్లు లేక,ఆర్థిక స్థోమత అందక ప్రభుత్వ చేయూత కోసం ఎదురుచూస్తున్నారని, కరీంనగర్ శివారు చింతకుంట లో కట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను వెంటనే పేదలకు ఇవ్వాలని, ప్రభుత్వం నెలరోజుల్లో అర్హులైన పేదలకు చింతకుంట, తీగలగుట్టపల్లిలో కట్టిన ఇండ్లను ఇవ్వకపోతే సిపిఐ ఆధ్వర్యంలో ఇండ్లను ఆక్రమిస్తామని, ప్రభుత్వ స్థలాలను గుర్తించి నిరుపేదలకు ఇల్లు కట్టించకపోతే సిపిఐ ఆధ్వర్యంలో ప్రభుత్వ స్థలాలలొఎర్రజెండాలు పాతీ ప్రజలకు పంచుతామని సురేందర్ రెడ్డి హెచ్చరించారు.






