18-02-2026 12:20:07 AM
హైదరాబాద్, ఫిబ్రవరి 17 (విజయక్రాంతి): హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల క్యూర్ (కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ)పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఇందుకు సంబంధించి వచ్చే మార్చి చివరినాటికి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేస్తామని ప్రకటించారు.
మురికివాడల్లో ఇందిరమ్మ మోడల్ కాలనీలు, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి స్థలాల సేకరణ,అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం పూర్తి, పూర్తయిన ఇండ్ల కేటాయింపు తదితర అంశాలపై మంగళవారం నాడు సచివాలయంలోని తన కార్యాలయంలో రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల ఇన్చార్జి మంత్రులు డి. శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్తో కలిసి సమీక్షించారు. ఈ సమావేశంలో హౌసింగ్ కార్యదర్శి విపి గౌతమ్ పాల్గొన్నారు.
హైదరాబాద్కు దూరంగా గతంలో 42వేల ఇండ్లను నిర్మించగా అందులో సగం మంది మాత్రమే అక్కడ నివసిస్తున్నారని ఇటీవల నిర్వహించిన క్షేత్రస్ధాయి సర్వేలో తేలిందని సమావేశంలో అధికారులు మంత్రుల దృష్టికి తీసుకువచ్చారు. అలాగే చాలాచోట్ల బోగస్ లబ్ధిదారులు కూడా ఉన్నారని అధికారులు మంత్రులకు వివరించారు.
నిరుపేదల జీవనోపాధికి ఇబ్బంది లేకుండా, వారి నివాస ప్రాం తాలకు దగ్గరగా స్థానిక పరిస్థితులను బట్టి ఐదు నుంచి 10 అంతస్తుల ఇందిరమ్మ ఇండ్లను నిర్మించాలనే ఆలోచన చే్స్తున్నామని ,వచ్చే క్యాబినెట్ సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.
ముగ్గురు మున్సిపల్ కార్పొరేషన్ల కమీ షనర్లు, నాలుగు జిల్లాల కలెక్టర్లు సమన్వయంతో వారి వారి ప్రాంతాల్లో స్థలాలను గుర్తించి ఎన్ని ఇండ్లు నిర్మించవచ్చు, ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు వంటి వివరాలతో పదిరోజుల్లో నివేదిక అందజేయాలని ఆదేశించారు. మూడు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో ఇండ్ల స్ధలాలు ఉన్న 28వేల మంది లబ్దిదారులకు ఈనెల చివరిలోగా ఇందిరమ్మ ఇండ్ల మం జూరు పత్రాలను అందజేయాలని అధికారులను ఆదేశించారు.