కొండాపూర్ ప్రభుత్వాసుపత్రిలో తనిఖీ
-సేవల మెరుగుదలకు ఆరోగ్యశాఖ కమిషనర్ సంగీత ఆదేశాలు
శేరిలింగంపల్లి, ఏప్రిల్ 16 (విజయక్రాంతి): ప్రజలకు అందుతున్న వైద్య సేవల నాణ్యతను మెరుగుపరచడమే లక్ష్యంగా ఆరోగ్యశాఖ కమిషనర్ సంగీత సత్యనారాయణ రంగారెడ్డి జిల్లా కొండాపూర్ ప్రభు త్వాసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో అందుతున్న సేవలను సమగ్రంగా పరిశీలిస్తూ ‘తెలంగాణ డయాగ్నస్టిక్స్’ ద్వారా నిర్వహిస్తున్న పరీక్షలపై వైద్యులతో సమీక్ష నిర్వహించారు.
ప్రజలకు 134 రకాల వైద్య పరీక్షలను సకాలంలో పూర్తి చేసి, నివేదికలను ఆలస్యం లేకుండా అందించాల్సిందిగా ఆమె ఆదేశించారు. మాతా శిశు సంక్షేమ కార్యక్రమాల అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రతి గర్భిణీని ఎంసిహెచ్ పోర్టల్లో తప్పనిసరిగా నమోదు చేసి, నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. కొండాపూర్లో నిర్మాణం లో ఉన్న గ్రామ కేర్ సెంటర్ను పరిశీలించి పనుల పురోగతిపై ఆరా తీశారు. జిల్లాలో కనీసం 30 శాతం ఆసుపత్రులు జాతీయ నాణ్యతా ప్రమాణాలు సాధించేలా కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ లలితాదేవి,డీసీహెచ్ఎస్ డాక్టర్ అనురాగిణి, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రకృష్ణ, జిల్లా ప్రోగ్రాం అధికారులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.






