13-02-2026 12:00:00 AM
దోమకొండ, ఫిబ్రవరి12, (విజయక్రాంతి): దోమకొండ మండలం ముత్యంపేట గ్రామంలో ఆర్అండ్బి రోడ్డు విస్తరణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో, భవిష్యత్లో తాగునీటి అవసరాలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో భూగర్భ పైపుల ఏర్పాటు చేపట్టారు. గ్రామంలోని ప్రైమరీ స్కూల్, సొసైటీ, నాలుగో వార్డు, బొబ్బిలి లింగం ఇల్లు, క్రింది అంబేద్కర్ ప్రాంతాల్లో పెద్ద పైపులు వేశారు.
ఈ పనులతో రాబోయే రోజుల్లో రోడ్డు తవ్వకాల అవసరం లేకుండా నీటి సరఫరా సౌకర్యం మెరుగుపడనుంది. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఆశబోయిన అక్షరశ్రీనివాస్, ఉప సర్పంచ్ సిరిగాధ మహేందర్ గౌడ్, వార్డు సభ్యులు మెంట్ల రాములు, ముత్తి బుచ్చిరాజయ్యతో పాటు పాలకవర్గ సభ్యులు, గ్రామ పెద్దలు, పంచాయతీ సిబ్బంది పాల్గొని పనులను పర్యవేక్షించారు. గ్రామ అభివృద్ధికి ఈ చర్య ఉపయోగపడుతుందని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.