సమన్వయం లేని ఏకీకృతం నాసిరకం!
రెసిడెన్షియల్స్లో సరుకుల కొనుగోలు విధానంలో లోపాలు
నాణ్యత, జవాబుదారీతనంపై పెరుగుతున్న ఆందోళనలు
* తక్కువ ధరలకే సరఫరా చేసే ప్రక్రియ ఆహ్వానించదగినదే అయినప్పటికీ.. నాణ్యత, సకాలంలో పంపిణీ, పోషకాహార ప్రమాణాల్లోనే ఉన్నాయా అనేదే అసలు పరీక్ష అని విమర్శకులు అంటున్నారు. రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఉండే పిల్లలు ఆర్థికంగా వెనుకబడిన నేపథ్యాల నుండి వస్తారు. వారికి పోషకాహారం ఈ విద్యాసంస్థల్లోనే అందించాలి.
నాణ్యతలో ఏ చిన్న లోపం ఉన్నా.. అది పప్పు ధాన్యాల పరిశుభ్రతలో కావచ్చు, చక్కెరలోని తేమ శాతంలో కావచ్చు, ఇతర వస్తువుల తాజాదనంలో కావచ్చు విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. గతంలో కొన్నిసార్లు కోట్ చేసిన ధరలకు, సరఫరా చేసిన వస్తువుల నాణ్యతకు మధ్య వ్యత్యాసం ఉన్నట్టుగా తేలిందని ప్రభుత్వ సంస్థలే తేటతెల్లం చేశాయి.
హైదరాబాద్, ఆగస్టు 22 (విజయక్రాంతి): సరఫరా వ్యవస్థలో లోటుపాట్ల ను సరిదిద్ది.. ఖర్చులను తగ్గించే ఉద్దేశంతో రాష్ట్రంలోని సుమారు 3,800 రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలకు నిత్యావసర సరుకుల కొనుగోలు బాధ్యతను కేంద్రీకృతంగా నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచించింది. ఇందుకుగాను ఒక ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ (పీఎంయూ)ను ప్రభుత్వం ఏర్పాటు చేసిం ది.
షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ), షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీ), వెనుకబడిన తరగతులు (బీసీ), మైనార్టీలు, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల (కేజీబీవీ)కు చెందిన సుమారు 7.5 లక్షల మంది విద్యార్థులకు వర్తిస్తుంది. అయినప్పటికీ.. తక్కువ ధరలకు అందించే క్రమంలో రాష్ట్రంలోని అత్యంత పేద, బలహీన వర్గాల పిల్లలకు అందుతున్న ఆహార నాణ్యత, సరఫరా దెబ్బతింటున్నాయా అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
గతంలో ఆయా రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలకు అవసరమైన కంది పప్పు, చక్కెర, చింతపండు ఇతర నిత్యావసర సరుకుల కొనుగోళ్లను 33 జిల్లాల ‘డిస్ట్రిక్ట్ పర్చేజ్ కమిటీలు’ (డీపీసీ) నిర్వహిస్తూ వచ్చాయి. ప్రతి కమిటీకి ఆయా జిల్లాల అదనపు కలెక్టర్ నేతృత్వం వహించగా, అందులో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి (డీఎంహెచ్వో), జిల్లా విద్యాశాఖాధికారి (డీఈవో), సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు సభ్యులుగా ఉండేవారు.
జిల్లా స్థాయిలోని ఈ కమిటీలు అప్పటి మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఉన్న ధరలకు క్రమం తప్పకుండా ఆమోదం తెలిపేవి. స్థానిక చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (ఎస్ఎంఈ), మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ ప్రైజెస్ (ఎంఎస్ఎంఈ)కు ప్రాధాన్యత ఇచ్చేవి. ఉదాహరణకు, కందిపప్పు సాధారణంగా కిలో రూ. 170 చొప్పున సేకరించేవారు. కొత్త కేంద్రీకృత నమూనా కింద, పీఎం యూ పిలిచిన టెండర్లలో గణనీయంగా తక్కువ ధరకే కొటేషన్లు వచ్చాయి. కందిపప్పు ధరలు కిలో రూ. 140కి తగ్గాయి.
చర్చల ద్వారా దాదాపు రూ. 130కి ఖరారయ్యాయి. మార్కెట్లో కిలో చక్కెర ధర రూ. 60 ఉండగా, ఇక్కడ రూ. 50గా నిర్ణయించారు. గణాంకాలను చూస్తే.. ప్రభు త్వం భారీగా ఆదా చేసినట్టుగా కనపడుతుంది. అయితే, సరఫరా కాంట్రాక్ట్ కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ అయిన నాఫెడ్ (నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా)కు అప్పగించారు. కొన్ని అధికారిక పత్రాలలో దీనిని నాకోఫ్ (ఎన్ఏఏసీవోఎఫ్) అని కూడా పేర్కొన్నారు.
విశ్వసనీయ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. నాఫెడ్, కేంద్రీయ భండార్ ఈ రెండు సంస్థలపై పౌరసరఫరాల శాఖ జరిమానా విధించింది. అదే సంవత్సరంలో సరైన సరఫరా చేయడంలో వైఫల్యం చెందినందుకు ఈ జరిమానా విధించారు. సరఫరా బాధ్యతలను నెరవేర్చడం లో విఫలమైనందుకు ఆ ఏజెన్సీల నుంచి రూ. 65 కోట్లకు పైగా రికవరీ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఇది శాఖల మధ్య సమన్వయ లోపాన్ని బహిర్గతం చేసింది.
రెండు సంస్థల వైఫల్యాన్ని గుర్తించిన ఒక శాఖ, భారీ మొత్తంలో నిధుల రికవరీకి ఆదేశించగా.. అదే ఏజెన్సీలకు ప్రభుత్వంలోని మరొక విభాగం లక్ష లాది మంది గురుకుల విద్యార్థులకు ఆహారాన్ని అందించే ప్రధాన కాంట్రాక్టును ఎలా కట్టబెడుతుందని అధికారులు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. పౌర సరఫరాల శాఖకు, పీఎంయూ మధ్య స్పష్టమైన సమాచార లోపం ఉందని తేటతెల్లం అయ్యింది. సంస్థాగత సమాచారం, పనితీరు నివేదికల ను, అందులోని సమాచారాన్ని వివిధ శాఖ ల మధ్య అందడం లేదనే ఆందోళనలకు బలం చేకూరుతోంది.
తక్కువ ధరలకే సరఫరా చేసే ప్రక్రియ ఆహ్వానించదగ్గవే అయినప్పటికీ.. నాణ్యత, సకాలంలో పంపిణీ, పోషకాహార ప్రమాణాలలోనే ఉన్నాయా అనేదే అసలు పరీక్ష అని విమర్శకులు అంటున్నారు. రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఉండే పిల్లలు ఆర్థికంగా వెనుకబడిన నేపథ్యాల నుండి వస్తారు. వారికి పో షకాహారం ఈ విద్యాసంస్థల్లోనే అందించాలి.
నాణ్యతలో ఏ చిన్న లోపం ఉన్నా.. అది పప్పు ధాన్యాల పరిశుభ్రతలో కావచ్చు, చక్కెరలోని తేమ శాతంలో కావచ్చు, ఇతర వస్తు వుల తాజాదనంలో కావచ్చు విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుం ది. గతంలో కొన్నిసార్లు కోట్ చేసిన ధరలకు, సరఫరా చేసిన వస్తువుల నాణ్యతకు మధ్య వ్యత్యాసం ఉన్నట్టుగా తేలిందని ప్రభుత్వ సంస్థలే తేటతెల్లం చేశాయి.
స్థానిక వ్యాపారులు, ఎంఎస్ఎంఈ సం ఘాలు కూడా ఈ విషయంలో తమ అసంతృప్తిని వ్యక్తం చేశాయి. పూర్వపు జిల్లా స్థా యిలో టెండర్లు పిలవడం వల్ల స్థానిక ఎంఎస్ఎంఈలకు ఆర్థిక సహకారం లభించేది. స్థానిక మార్కెట్ పరిస్థితులు, సరఫరాపై అవగాహన ఉన్న అధికారుల ద్వారా పర్యవేక్షణ సులభంగా ఉండేదని వారు చెబుతున్నారు. అయితే కేంద్రీకృత విధానం వల్ల ఈ చిన్న వ్యాపారులను పక్కన పెట్టడమే కాకుండా.. ఆరోపణలు వచ్చిన పెద్ద పెద్ద ఏజెన్సీల చేతు ల్లో నిత్యావసర వస్తువుల సరఫరా కేంద్రీకృతమయ్యే ప్రమాదం ఉంది.
జిల్లాల వారీగా ఉండే ధరల వ్యత్యాసాలను తొలగించడం, ఎక్కువ ధరకు కొనుగో లు చేసే అవకాశాలను తగ్గించడం, పెద్ద మొ త్తంలో కొనుగోలు చేయడంతో ఖర్చు ఆదా చేయడమే లక్ష్యంగా ఏర్పాటుచేసిన పీఎంయూను ప్రభుత్వ వర్గాలు సమర్థిస్తున్నాయి. టెండర్ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరిగిందని, చర్చలతో ఖరారైన ధరలు ప్రభు త్వ ఖజానాకు పొదుపు చేశాయని వారు పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు పర్యవేక్షణ, నాణ్యతా పరీక్షలు చేపడితే నాసిరకం సరుకులు సరఫరా కాకుండా అడ్డుకోగలమని వారంటున్నారు.
అయినప్పటికీ, భారీగా ధరలు తగ్గడం, గతంలో జరిమానా విధించిన ఏజెన్సీలనే ఎంపిక చేయడం లాంటి అంశాలు అనుమానాలను సృష్టిస్తున్నాయి. టెండర్ ప్రక్రియ లో మరింత పారదర్శకత ఉండాలని, కాం ట్రాక్టులలో పేర్కొన్న నాణ్యతా ప్రమాణాలను బహిరంగంగా వెల్లడించాలని, పాఠశా లలకు చేరుకునే సరుకులను థర్డ్-పార్టీ ద్వారా పరీక్షించాలని విద్య, సాంఘిక సంక్షేమ వర్గా లు డిమాండ్ చేస్తున్నారు. మునుపటిలా రికవరీలకు దారితీసే వైఫల్యాలు మళ్లీ జరగకుండా నిరోధించేలా ఒప్పందాలలో ఎ లాంటి రక్షణ చర్యలు చేర్చారో ప్రభుత్వం స్ప ష్టం చేయాలని కూడా వారు కోరుతున్నారు.
7.5 లక్షల మంది విద్యార్థులపై ప్రభావం
వేలాది సంస్థల్లోని 7.5 లక్షల మంది విద్యార్థులకు భోజనం అందించడానికి సు దూర ఆశ్రమ పాఠశాలలు, నివాస సముదాయాలకు నిర్ణీత సమయానికి చేరుకోగల లాజిస్టిక్స్ నెట్వర్క్ అవసరం. ఆలస్యంగా చెల్లింపులు, నాణ్యతా లోపాలు, సరఫరాదారుకు సామర్థ్యం లేకపోవడం వంటి కారణా ల వల్ల ఏదైనా అంతరాయం ఏర్పడితే.. వం టశాలలలో నిత్యావసర సరుకుల కొరత ఏర్పడవచ్చు. ఇటువంటి పరిస్థితులు.. పిల్లల హాజరు, ఏకాగ్రత, వారి శ్రేయస్సుపై ప్రభా వం చూపుతాయి.
కేంద్రీకృత కొనుగోలు విధానం అనేది సహజంగా లోపభూయిష్టమైనది కాదని పరిశీలకులు అంటున్నారు. అయితే.. కఠినమైన నాణ్యత హామీ, రియల్ టైమ్ ట్రాకింగ్, జవాబుదారీతనం విధానాలను అమలుచేస్తూ.. అనేక రాష్ట్రాలు ఇలాంటి నమూనాల ను విజయవంతంగా నిర్వహిస్తున్నాయి. ప్రస్తుత వివాదం కేంద్రీకరణ అనే సూత్రం కంటే సరఫరాదారు ఎంపిక, సంబంధిత బాధ్యతలను నిర్వహించే శాఖల మధ్య స్పష్టమైన సమన్వయ లోపం చుట్టూనే ఎక్కువ తిరుగుతోంది.
ఈ కొత్త వ్యవస్థ సమర్థతను టెండర్ పత్రాలలో కోట్ చేసిన ధరలతో కాకుండా.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న భోజన శాలల్లో వడ్డిం చే భోజనం నాణ్యతతో కొలవాలి. విద్య, పోషణ రెండింటి కోసం ఈ పాఠశాలలపై ఆధారపడే పిల్లలకు, కిలో కందిపప్పు రూ. 170 మరియు రూ. 130 మధ్య ఉన్న వ్యత్యా సం కంటే, తమ పళ్లెంలోకి వచ్చే పప్పు పుష్టికమైనదా, నాణ్యంగా ఉందా, అంతరాయం లేకుండా సరఫరా చేస్తున్నారా అనేది ప్రధానమైనది.
సంక్షేమ సంస్థలకు ఖర్చు పెట్టడం, సామర్థ్యంగా నిర్వహించడం, నమ్మకంగా సరఫరా చేసేలా చూడటమే ఇప్పుడు ప్రభుత్వానికి అసలు పరీక్ష. పారదర్శక పర్యవేక్షణ, నాణ్యతపై సమాచారం బయటకు వచ్చేంత వర కు.. ఈ 7.5 లక్షల మంది విద్యార్థుల నిత్యావసరాల భద్రత, సమృద్ధిపై సందేహాలు కొనసాగుతూనే ఉంటాయి.






