అంతర్జాతీయ బాలల పుస్తక దినోత్సవం
కరీంనగర్,(విజయక్రాంతి): అంతర్జాతీయ బాలల పుస్తక దినోత్సవం(International Children Book Day) సందర్భంగా కరీంనగర్ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీ సత్తు మల్లేష్ అధ్యక్షతన లయన్స్ క్లబ్ వారి సహకారంతో చిన్నారులతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రంథాలయానికి వచ్చిన చిన్నారులతో పుస్తక పఠనంపై అవగాహన కార్యక్రమం నిర్వహించగా, పాల్గొన్న చిన్నారులకు బహుమతులు అందజేశారు.
అదేవిధంగా లయన్స్ క్లబ్ సహకారంతో జిల్లా గ్రంథాలయానికి నాలుగు సిమెంట్ బెంచీలు అందించారు. ఈ సందర్భంగా సత్తు మల్లేష్ మాట్లాడుతూ, చిన్నారుల్లో పుస్తక పఠన అలవాటు పెంపొందించడం సమాజ అభివృద్ధికి ఎంతో అవసరమని, గ్రంథాలయాలు వారి జ్ఞాన వికాసానికి ముఖ్య కేంద్రాలుగా నిలుస్తాయని తెలిపారు. పిల్లలు చిన్ననాటి నుంచే మంచి పుస్తకాలు చదివి తమ భవిష్యత్తును నిర్మించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు ముక్కె శరత్ క్రిష్ణ, లయన్స్ క్లబ్ కార్యదర్శి మ్యాజిక్ శివకాంత్, లయన్స్ క్లబ్ ప్రోగ్రాం చైర్మన్ సింగ గమరాజు, గ్రంథాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు...




