14 March, 2026 | 3:52 AM

ఇరాన్‌లో 200కు పైగా లక్ష్యాలపై ఇజ్రాయెల్ దాడి

14-03-2026 01:15 AM

బాలిస్టిక్ క్షిపణి లాంచర్లు, రక్షణ వ్యవస్థలు, ఆయుధ ఉత్పత్తి ప్రదేశాలే లక్ష్యంగా ఐడీఎఫ్ బాంబుల వర్షం 

టెహ్రాన్ ర్యాలీలో బ్లాస్ట్.. ఒక మహిళ మృతి

కరాజ్‌లోనూ అనేక పేలుళ్లు .. బాంబులేసిన ఫైటర్ జెట్లు 

లెబనాన్‌లో 687 మంది మృతి

టెహ్రాన్, మార్చి 13: ఇరాన్ అంతటా 200 కంటే ఎక్కువ లక్ష్యాలను ఢీకొట్టినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. రాజధానిలో భారీ దాడులు చేశామని పేర్కొంది. పశ్చిమ, మధ్య ఇరాన్‌లోని 200 కంటే ఎక్కువ లక్ష్యాలపై ఐడీఎఫ్ దాడులు నిర్వహించింది. బాలిస్టిక్ క్షిపణి లాంచర్లు, రక్షణ వ్యవస్థలు, ఆయుధ ఉత్పత్తి ప్రదేశాలను ఢీకొట్టిందని ఇజ్రాయెల్ రక్షణ దళాలు తెలిపాయి. అసోసియేటెడ్ ప్రెస్ నివేదించిన ప్రకారం..

ఖుద్స్ దినోత్సవ ర్యాలీలకు ముందు టెహ్రాన్‌లో భారీ వైమానిక దాడులు జరిగాయి. ఇజ్రాయెల్ వైమానిక దళం టెహ్రాన్‌లోని విస్తృతమైన వైమానిక దాడులను కొత్తగా ప్రారంభించింద ని ఇజ్రాయెల్ రక్షణ దళాలు (ఐడీఎఫ్) తెలిపాయి. ఇరాన్ పాలనకు సంబంధించిన మౌలిక సదుపాయాల ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయని సైన్యం తెలిపింది. ఇరాన్‌లోని కరాజ్‌లో అనేక పేలుళ్లు జరిగాయి. ఫైటర్ జెట్లు బాంబులతో విరుచుకుపడ్డాయి. ఈ పేలుళ్లు టెహ్రాన్‌కు పశ్చిమాన ఉన్న కరాజ్‌లో జరిగాయని ఇరాన్ రాష్ట్ర మీడియా పేర్కొంది.

అయితే ఈ దాడులకు ముందే టెహ్రాన్ ప్రాంతంలోని అనేక ప్రాంతాలలో నివసించేవారికి ఇజ్రాయెల్ సైన్యం ‘అత్యవసర హెచ్చరిక’ జారీచేసింది. ప్రణాళికాబద్ధమైన వైమానిక దాడులకు ముందు వారిని సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని కోరింది. ఇరాన్ సైనిక, మౌలిక సదుపాయాలపై మరికొద్ది గంటల్లో ఇజ్రాయెల్ సైన్యం దాడి చేస్తందని టెహ్రాన్ పౌరులను ఐడీఎఫ్ పర్షియన్ భాషా ప్రతినిధి, లెఫ్టినెంట్ కల్నల్ (రెస్) కమల్ పెన్హాసి హెచ్చరించారు. 

టెహ్రాన్, షిరాజ్, అహ్వాజ్ ప్రదేశాలు విధ్వంసం

టెహ్రాన్, షిరాజ్, అహ్వాజ్ ప్రదేశాలపై ఐడీఎఫ్ దాడులు చేసినట్లు తెలిపింది. ఇజ్రాయెల్ సైన్యం గురువారం టెహ్రాన్, షిరాజ్, అహ్వాజ్‌ల్లో ఇరాన్ పాలన, మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని అనేక దాడులను పూర్తి చేసిందని తెలిపింది. పాలన వ్యవస్థలు, సామర్థ్యాలకు తీవ్ర నష్టం కలిగించే ప్రయత్నాలలో భాగంగా మిలిటరీ ఇంటెలిజెన్స్ మార్గదర్శకత్వంతో ఈ దాడులు జరిగాయి.

షిరాజ్‌లో బాలిస్టిక్ క్షిపణుల ఉత్పత్తి, నిల్వ కోసం ఉపయోగించే భూగర్భ స్థావరాన్ని ఇజ్రాయెల్ విమానం ఢీకొట్టింది. టెహ్రాన్‌లో యుద్ధ పరికరాలు, వాయు రక్షణ వ్యవస్థలు, బాలిస్టిక్ క్షిపణి భాగాలను ఉత్పత్తి చేయడానికి ఉపయోగించే సౌకర్యాలతో పాటు, వైమానిక రక్షణ శ్రేణి స్థావరాలు, కేంద్ర స్థావరాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు సైన్యం తెలిపింది.

లెబనాన్‌లో 687 మంది మృతి

యూఎస్ ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం వల్ల ఆయా దేశాల్లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. లెబనాన్‌లో రోజురోజుకూ ఇజ్రాయెల్ సైన్యం దాడులు విస్తరిస్తున్నాయి. దీంతో లెబనాన్‌లో ప్రాణనష్టం పెరిగింది. లెబనాన్‌లో మృతుల సంఖ్య 687కి చేరింది. దాదాపు 1,850 మంది గాయపడ్డారు. ఈ దేశ దక్షిణ ప్రాంతంలో పోరాటం తీవ్రమవుతోంది. ఇజ్రాయెల్ రక్షణ దళాలు దక్షిణ ప్రాంతాల్లోని అదనపు గ్రామాలకు తరలింపులను ఆదేశించిన తర్వాత దాదాపు పది లక్షల మంది నివాసితులు నిరాశ్రయులయ్యారు.

తరలింపు ఆదేశాలు విస్తరించడం వల్ల మానవతా సంక్షోభం మరింత తీవ్రమైంది. వేలాది మంది తమ ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు పోవాల్సి వచ్చింది. దీంతో క్షేత్రస్థాయిలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి. మరోపక్క లెబనాన్ రాజధాని అయిన బీరుట్‌లో హిజ్బుల్లా కార్యకర్తలపై దాడి చేసినట్లు ఇజ్రాయెల్ దళాలు తెలిపాయి. ఈ మేరకు ఇజ్రాయెల్ రక్షణ దళాలు (ఐడీఎఫ్) ఒక సంక్షిప్త ప్రకటనలో ఆపరేషన్‌ను ధృవీకరించాయి.

టెహ్రాన్ ర్యాలీలో బ్లాస్ట్.. ఒక మహిళ మృతి

యూఎస్ -ఇజ్రాయెల్-, ఇరాన్ యుద్ధం వల్ల పశ్చిమాసియా ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తతలు మరింత ఉధృతం అవుతున్నాయి. 14వ రోజైన శుక్రవారం కూడా వైమానిక దాడులు జరిగాయి. ఇరాన్ రాజధాని అయిన టెహ్రాన్‌లో ప్రభుత్వానికి మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ సమీపంలో ఒక పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒక మహిళ మృతి చెందింది. ఇరాన్ రాష్ట్ర ప్రసార సంస్థ ప్రెస్ టీవీ ప్రకారం..

టెహ్రాన్‌లో ఒక ర్యాలీ సమీపంలో యూఎస్- వైమానిక దాడిలో కనీసం ఒక మహిళ మరణించింది. ఇరాన్ రాజధానిలో నిర్వహిస్తున్న భారీ ప్రదర్శనకు సమీపంలో పేలుళ్లు సంభవించిన తర్వాత ఆ మహిళ గాయాలతో మరణించినట్లు సమాచారం. ఇరాన్‌లోని మరో నగరం ఖజ్విన్‌లోనూ భారీ పేలుడు సంభవించింది. ప్రభుత్వ అనుకూల ర్యాలీ కోసం వేలాది మంది గుమిగూడడంతో తీవ్ర ఉద్రిక్తతల మధ్య ఈ దాడి జరిగింది.

నగరం అంతటా అనేక పేలుళ్లు సంభవించాయి. ఈ దాడులు ఎవరు చేశారనే విషయం తెలియలేదు. అయితే ఖజ్విన్, టెహ్రాన్‌లో పేలుళ్లు జరుపుతామని ఇజ్రాయెల్ ముందే హెచ్చరించింది. మరోవైపు దాడులు జరుగుతున్నప్పటికీ వేలాది మంది పౌరులు టెహ్రాన్ వీధుల్లోకి వచ్చి ఇజ్రాయెల్, అమెరికాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.