6 June, 2026 | 5:32 PM

డ్రైనేజీ, సీసీ రోడ్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

06-06-2026 04:46 PM

- కౌన్సిలర్ నక్క సంతోష్ రాములు గౌడ్

- 15వ వార్డులో ప్రజాపాలన 99 రోజుల ప్రగతి ప్రణాళిక వార్డు సభ 

గజ్వేల్: సంగుపల్లి ప్రాంతంలో డ్రైనేజీ వ్యవస్థ లోపాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పెండింగ్‌లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని 15వ వార్డు కౌన్సిలర్ నక్క సంతోష రాములు గౌడ్ అధికారులను కోరారు. ప్రజాపాలన 99 రోజుల ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన "మన వార్డు–మన సభ" కార్యక్రమంలో ఆమె ఈ విషయాలను ప్రస్తావించారు. సంగుపల్లిలో వంద శాతం డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు కాలేదని, దీంతో మురుగునీటి పారుదల సక్రమంగా జరగక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కొన్ని గల్లీల్లో మురుగునీటికి యూజీడీ కనెక్షన్లు లేకపోవడంతో కాలువల్లో నీరు నిలిచి దుర్వాసన వ్యాపిస్తోందని చెప్పారు.

ఈ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్ గణేష్‌ను కోరారు. మురుగుకాలువల నుంచి తొలగించిన చెత్తను రోజుల తరబడి అలాగే ఉంచకుండా వెంటనే తరలించాలని, కాలువలపై స్లాబులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే వర్షాలు కురిస్తే బురదమయంగా మారుతున్న గల్లీ రోడ్లపై ప్రజలు నడవలేని పరిస్థితి నెలకొంటోందని, సీసీ రోడ్లు నిర్మించాలని కోరారు. కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ కమిషనర్ గణేష్ మాట్లాడుతూ ప్రజలు ఇంటి పన్నులు, నల్లా బిల్లులను సకాలంలో చెల్లించాలని సూచించారు. చెత్తను చెత్తబండిలో వేయడం ద్వారా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ వార్డు సభలో పారిశుద్ధ్యం, మిషన్ భగీరథ నీటి సరఫరా, విద్యుత్ సమస్యలు, వీధి దీపాలు, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు సంబంధించిన పలు సమస్యలను ప్రజలు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.