12-06-2025 12:21:04 AM
- విద్యుత్ శాఖలో కొరవడిన పర్యవేక్షణ
- లైన్ మెన్ల వసూళ్లు
- అధికారులకు వాటా
- వ్యవసాయానికి విద్యుత్ ఉచితమైనా తప్పని వసూళ్లు
- కనెక్షన్లకు, పానెల్ బోర్డులకు తప్పని మామూళ్లు
గజ్వేల్, జూన్ 11: నెలవారి విద్యుత్ బిల్లులోనే కాదు, విద్యుత్ శాఖ ఉద్యోగులు ప్రజలకు ఇచ్చే అన్ని సేవల్లో అ’ధనం’గా చార్జీలు చెల్లించక తప్పడం లేదు. సిద్దిపేట జిల్లా విద్యుత్ శాఖలో జరుగుతున్న అవినీతి భాగవతాన్ని విజయక్రాంతి ప్రచురిస్తున్న విషయం తెలిసిందే.
రాష్ట్ర రాజధానికి ఆనుకొని ఉన్న గజ్వేల్ డివిజన్ లో విద్యుత్ డిమాండ్ అధికంగా ఉండడం రైతుల, పారిశ్రామికవేత్తల, గృహ వినియోగదారుల అవకాశాన్ని ఆసరాగా చేసుకుని విద్యుత్ శాఖ ఉద్యోగులు అందిన కాడికి దండుకుంటున్నారని బాధితులు విజయక్రాంతికి తెలిపారు. విద్యుత్ ఉద్యోగుల అక్రమ వసూళ్లను విజయక్రాంతికి వివరించారు. ఒక ఊరు, ఒక మండలమే కాదు గజ్వేల్ డివిజన్ లో ఎవరిని కదిలించిన విద్యుత్ శాఖలో కిందిస్థాయి ఉద్యోగుల నుంచి ఉన్నత స్థాయి అధికారుల వరకు వసూలు బాగోతాన్ని వెల్లడించారు.
ఆనవాయితీగా వసూళ్లు...
వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందించే ప్రభుత్వం 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించే గృహ వినియోగదారులకు కూడా ఉచిత విద్యుత్ అందిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. కానీ విద్యుత్ శాఖ ఉద్యోగులు ప్రజలు అదనంగా డబ్బులు చెల్లిస్తేనే పనులు చేయడం పరిపాటిగా మారింది. గజ్వేల్ డివిజన్ పరిధిలోని అన్ని మండలాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఇక పారిశ్రామిక ప్రాంతాలైన ములుగు, మర్కుక్, వర్గల్ తదితర మండలాల్లో విద్యుత్ సేవలకు సిబ్బందితోపాటు ఉన్నతాధికారులు కూడా భారీ స్థాయిలో అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
వ్యవసాయ కనెక్షన్, ఇంటి కనెక్షన్ అయినా, పారిశ్రామిక ( కమర్షియల్) కనెక్షన్ అయినా ఆయా స్థాయిల్లో వేల నుండి లక్షల వరకు డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వ్యవసాయ కనెక్షన్లు ఇచ్చే క్రమంలో స్తంభాలు పాతే సిబ్బంది కూడా రూ.వెయ్యి ఇస్తే కానీ అక్కడి నుంచి కదలని పరిస్థితులను రైతులు ఎదుర్కొంటున్నారు. వ్యవసాయదారులు కింది స్థాయికి సిబ్బంది డబ్బులు అడుగుతారని నేరుగా విద్యుత్ శాఖ మండల స్థాయి అధికారులను సంప్రదించి విద్యుత్ కనెక్షన్లు, ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ స్తంభాలు మంజూరు చేసుకున్నా కూడా తిరిగి కిందిస్థాయి సిబ్బందికి అదనంగా డబ్బులు చెల్లించాల్సిందే.
కమర్షియల్ భవనాలలో అదనపు మీటర్ల ఏర్పాటుకు రూ.లక్ష వరకు మరింత పెద్ద భవనాలు ఉంటే లక్షకు పైగానే డబ్బులు చెల్లించాల్సిందే. ఇలాంటి విషయాల్లో లైన్ ఇన్స్పెక్టర్ల పాత్ర ప్రస్తుతం కీలకంగా మారింది. ఇదేంటని బాధితులు ప్రశ్నిస్తే ఇది ఆనవాయితీగా ఇచ్చేదే కదా అంటూ ఉద్యోగులు స్మార్ట్ గా సమాధానం చెబుతున్నారు. కొత్తగా ఉద్యోగాల్లో చేరిన లైన్ మెన్ లు ఇలాంటి విషయాల జోలికి పోకపోవడంతో నేరుగా లైన్ ఇన్స్పెక్టర్లే వసూళ్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇంత జరుగుతున్న మండల, డివిజన్, జిల్లా స్థాయి అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రతినెలా రూ.లక్షలు ప్రజల సొమ్ము అ’ధనం’గా సమర్పించాల్సి వస్తుంది. ఇకనైనా అధికారులు మేల్కొని విద్యుత్ శాఖ ప్రక్షాళన చేయాలని, ప్రజలకు అ’ధనం’గా చార్జీలు లేకుండా ప్రభుత్వం దిశా నిర్దేశం చేసిన విధంగా సేవలందించాలని ప్రజలు కోరుతున్నారు. ఈ విషయంపై గజ్వేల్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వివరణ కోరెందుకు పలు మార్లు ఫోన్ ద్వారా సంప్రదించగా స్పందించలేదు.