01-06-2025 12:00:00 AM
చిత్ర పరిశ్రమలోకి ఎన్టీఆర్ బావమరిదిగా ఎంట్రీ ఇచ్చి వరుస విజయాలు అందుకుంటున్నాడు యంగ్ హీరో నార్నే నితిన్. ఇప్పుడు ‘శతమానం భవతి’ దర్శకులు సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘శ్రీశ్రీశ్రీ రాజావారు’. ఇందులో సంపద హీరోయిన్గా నటిస్తోంది. శ్రీవేదాక్షర మూవీస్ పతాకంపై చింతపల్లి రామారావు నిర్మిస్తున్నారు.
అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్తో యూత్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకున్న ఈ సినిమా జూన్ 6న థియేటర్ల ద్వారా ప్రేక్షకులకు ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ను శనివారం హైదరాబాద్లో నిర్వహించారు మేకర్స్. ఈ సందర్భంగా డైరెక్టర్ సతీశ్ వేగేశ్న మాట్లాడుతూ.. “ఈ సినిమాలో నరేశ్ ఒక డైలాగ్ చెబుతారు. మనల్ని మనం జయించుకోవడమే సక్సెస్ అంటే.
ఈ కాన్సెప్ట్తో సినిమాను రూపొందించాం. నా సినిమాల్లో ఎక్కువ మంది ఆర్టిస్టులు ఉంటారు. కారణం.. గతంలో మన కుటుంబాల్లో ఎక్కువ మంది ఉండటమే. నా కథల్లోనూ అలాంటి పాత్రలే పలకరిస్తాయి. మరుగున పడిన కొన్నింటిని సినిమాల ద్వారా చూపించాలని తాపత్రయపడుతుంటా. అలాంటి ప్రయత్నమే ఈ సినిమా. ఇది ప్రేక్షకులను ఏమాత్రం నిరాశపర్చదు” అన్నారు.
నిర్మాత రామారావు మాట్లాడుతూ.. ‘మంచి గ్రామీణ నేపథ్యంలో సాగే వెరైటీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. ఎన్టీఆర్ ఎంతో మెచ్చి ఈ కథను ఎంపిక చేశారు. ఆయన అంచనాల మేరకు దర్శకుడు సతీశ్ వేగేశ్న ఈ చిత్రాన్ని ఎక్కడా రాజీపడకుండా పూర్తి కమర్షియల్ ఫార్మాట్లో భారీ తారాగణంతో తెరకెక్కించారు’ అని చెప్పారు. ఈ వేడుకలో కోప్రొడ్యూసర్ సుబ్బారెడ్డి, దర్శక నిర్మాత రాజేశ్ పుత్ర, సంగీత దర్శకుడు కైలాషా మీనన్ తదితరులు పాల్గొన్నారు.