03-06-2025 12:04:47 AM
95 శాతం మార్కుల నిబంధన ఎత్తేయాలి...
అద్దె భవనాల సమస్యను పరిష్కరించాలి..
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ..
హైదరాబాద్ (విజయక్రాంతి): రాష్ట్రంలో 240 గురుకులాల్లో 1,200 మంది అసిస్టెంట్ కేర్టేకర్ పోస్టులను తొలగించి పిల్లలతో టాయిలెట్లు, తరగతి గదులు శుభ్రం చేయించాలని నిర్ణయించడం దుర్మార్గమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ(CPM State Secretary John Wesley) సోమవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. పేద, మధ్య తరగతి విద్యార్థుల ఉన్నత చదువుల కోసం గౌలిదొడ్డి, చిలుకూరు లాంటి ప్రతిష్ఠాత్మక గురుకులాలను ఏర్పాటు చేస్తే, ఎలాంటి సర్క్యులర్ జారీ చేయకుండానే ఇంటర్ మొదటి సంవత్సరం పూర్తి చేసిన విద్యార్థులకు ఖచ్చితంగా 95 శాతం మార్కుల నిబంధన పెట్టడం సరికాదని పేర్కొన్నారు. దాదాపు 12 గురుకులాల మూసేవేతంతో 11,520 మంది పేద, మధ్య తరగతి విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమవుతారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. 662 గురుకులాల అద్దె భవనాలకు రూ.215 కోట్ల అద్దె బకాయిలు ఉండటంతో యజమానులు తాళాలు వేసుకున్నారని, తక్షణమే ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు.