calender_icon.png 7 June, 2025 | 1:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

థియేటర్ల బంద్ అంశాన్ని పవన్‌కల్యాణ్ సినిమాకు ముడిపెట్టడం సరికాదు

01-06-2025 12:00:00 AM

ప్రముఖ నటుడు, దర్శకుడు, నిర్మాత ఆర్ నారాయణమూర్తి శనివారం మీడియాతో మాట్లాడారు. ప్రధానంగా థియేటర్ల బంద్, పర్సంటేజీల అంశంపై మాట్లాడారు. ఇదే సమయంలో గద్దర్ అవార్డులపైనా స్పందించారు. గద్దర్ అవార్డులు ఇచ్చినందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. అవార్డుల విజేతలకు అభినందలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ నంది అవా ర్డులు ఇవ్వాలని కోరారు.

ఈ సందర్భంగా థియేటర్ల సమస్యలపై స్పందించిన నారాయణమూర్తి చేసిన వ్యాఖ్యలు చర్చనీ యాంశంగా మారాయి. “పర్సంటేజీల విషయంలో ఈ మధ్య వివాదం నెలకొంది. ‘హరిహరవీరమల్లు’ కోసమే జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ చేస్తున్నారనేది అబద్ధం. పర్సంటేజీలు ఖరారైతే నా లాంటి నిర్మాతలకు ఎంతో మేలు చేకూరుతుంది.

పవన్‌కల్యాణ్‌పై ఎవరు కుట్ర చేస్తారు? ఆయన కార్యాలయం నుంచి ఆ ప్రకటన రావడం సమంజసంగా లేదు. ‘హరిహరవీరమల్లు’ కోసం కాకుండా సినీ పరిశ్రమ లోని సమస్యలపై చర్చిద్దాం రావాలని పిలిస్తే పవన్‌పై గౌరవం మరింత పెరిగేది” అని అన్నారు. 

ఛాంబర్ ముందు టెంటు వేసినా సమస్య పరిష్కారం కాలేదు 

“భారతదేశంలో సినిమా అనేది సగటు ప్రేక్షకుడికి దొరికే వినోదం. పర్సంటేజీ విధానాన్ని కోరుకునే వ్యక్తుల్లో నేను ఒక్కణ్ణి. పర్సంటేజీల విషయంలో ఛాంబర్ ముందు టెంటు వేసి ఆందోళనలు చేశాం. ఎంతో మంది ఛాంబర్ ప్రెసిడెంట్లకు విజ్ఞప్తి చేసినా సమస్య పరిష్కారం కాలేదు. పర్సంటేజీ విషయం ఒక కొలిక్కి వచ్చే దశలో ‘హరిహర వీరమల్లు’కు లింకు పెట్టడం సరికాదు. పరిశ్రమ పెద్దలు సీఎం చంద్రబాబును కలువాలని అనడంలో తప్పులేదు.

పర్సంటేజీ విషయాన్ని పక్కదారి పట్టించవద్దు. కార్పొరేట్ సిస్టమ్‌లకు వంత పాడుతున్నారు. మరి సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఏమైపోవాలి? సింగిల్ థియేటర్లు దేవాలయాల లాంటివి. సినిమా టికెట్ ధరల పెంపుతో ప్రేక్షకులు, పరిశ్రమ కు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. చవకగా దొరికే వినోదం ఖరీదుగా మారింది. భారీ ఖర్చుతో సినిమాలు తీయడం సబబే, కానీ ఆ ఖర్చును ప్రజలపై రుద్దవద్దు.

హాలీవుడ్‌లో ఎన్నో వందల కోట్లతో సినిమాలు తీస్తున్నారు. మన దగ్గర ‘షోలే’, ‘మొఘల్ ఏ ఆజాం’ లాంటి సినిమాలు వచ్చాయి. వాటి కోసం ధరలు పెంచలేదు. మన తెలుగులో ‘లవకుశ’ను ఐదేళ్లు తీశారు. ఆ సినిమాకు టికెట్ ధరలు పెంచమని అడగలేదు. సినిమాలు బాగుంటే జనం వస్తారు. టికెట్ ధరలు పెంచడం వల్ల అభిమానులే వాళ్ల హీరోల సినిమాలు చూడటం లేదు” అని నారాయణ మూర్తి అన్నారు.