24-06-2025 08:08:00 PM
టీబీ ఛాంపియన్స్ కు శిక్షణ
హుజురాబాద్ (విజయక్రాంతి): సైదాపూర్ మండలం క్షయ నిర్మూలన మండలంగా తీర్చీదిద్దుటకు, టీబీ ఛాంపియన్స్ కృషి చెయ్యాలని అరోగ్య పర్యవేక్షకుడు ఎస్ రమేష్(Health Supervisor Ramesh) అన్నారు. హుజురాబాద్ డివిజన్ పరిధిలోని సైదాపూర్ మండలంలో మంగళవారం మండల పరిషత్తు సమావేశ మందిరంలో జిల్లా క్షయ నివారణ విభాగం, ఇంపాక్ట్ ఇండియా ప్రాజెక్టు, టీబీ అలర్ట్ ఇండియా సౌజన్యంతో టీబీ ఛాంపియన్స్ కు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ... క్షయ వ్యాధి సోకిన వారిలో రెండు వారాలకు మించి దగ్గు, జ్వరం, ఆకలి మందగించడం, బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే, వెంటనే ప్రభుత్వం ఆసుపత్రిలో తెమడ పరీక్ష చేసుకోవాలని సూచించారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో క్షయ వ్యాధికి ఉచితంగా మందులు పంపిణితో పాటు పోషకాహారం నిమిత్తం నెలకు వెయ్యి రూపాయలు ప్రభుత్వం అందజేస్తూన్నదని తెలిపారు. ఎంపిడివో యాదగిరి మాట్లాడుతూ.. క్షయ వ్యాధిని జయించిన వారు సమాజంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. అనంతరం క్షయ వ్యాధి నయం అయిన వారిని ఛాంపియన్స్ గా గుర్తిస్తూ, ఎంపిక చేసిన గ్రామాల్లో వారు అవగాహన కల్పించుటకు శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి కృష్ణా రావు, ట్రైనింగ్ మేజర్ నరేందర్, టీబీ యూనిట్ సూపర్వైజర్ శ్రీనివాస్ రెడ్డి, కో-ఆర్డినేటర్లు ప్రభాకర్, గీతాంజలి, హేల్త్ విజిటర్ నిషాంత్, ఆశావర్కర్లు పాల్గోన్నారు.