జమ్మిగడ్డను ప్రత్యేక డివిజన్గా ప్రకటించాలి
రాధిక నుంచి ఈసీఐఎల్ జీహెచ్ఎంసీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ
కుషాయిగూడ (విజయక్రాంతి): జమ్మిగడ్డ ప్రాంతాన్ని ప్రత్యేక డివిజన్గా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ స్థానికులు ఉద్యమం చేపట్టారు. రెండు రోజుల రిలే నిరాహార దీక్ష అనంతరం మూడవ రోజు జమ్మిగడ్డ ప్రాంతానికి చెందిన సుమారు 300 మందికి పైగా ప్రజలు భారీ ర్యాలీ నిర్వహించారు. సోమవారం ఉదయం జమ్మిగడ్డ సాధన సమితి ఆధ్వర్యంలో డప్పు చప్పులతో నిరసన ర్యాలీ ప్రారంభమైంది. ఎన్టిఆర్ విగ్రహం నుంచి రాధిక మీదుగా ఈసీఐఎల్ చౌరస్తా, కుషాయిగూడ పోలీస్ స్టేషన్ మీదుగా కాప్రా సర్కిల్ కార్యాలయానికి చేరుకుంది. జమ్మిగడ్డలోని అన్ని కాలనీలను కలిపి ప్రత్యేక డివిజన్ ఏర్పాటు చేయాలని కోరుతూ డీసీకి వినతి పత్రం అందజేశారు.
ప్రస్తుతం జమ్మిగడ్డ ప్రాంతం పలు డివిజన్లలో విభజించబడటం వల్ల మౌలిక సదుపాయాలు, అభివృద్ధి పనుల్లో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు తెలిపారు. ప్రత్యేక డివిజన్గా ఏర్పాటు చేస్తే సమస్యలకు పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. సర్కిల్ కార్యాలయం ఎదుట ముక్తకంఠంతో నినాదాలు చేస్తూ బైఠాయించి పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. దాదాపు రెండు గంటల పాటు నినాదాలతో ప్రాంతం దద్దరిల్లింది. అనంతరం డిప్యూటీ కమిషనర్ జగన్ బయటకు వచ్చి వినతి పత్రాన్ని స్వీకరించారు. జమ్మిగడ్డను ప్రత్యేక డివిజన్గా ప్రకటించే అంశాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. జమ్మిగడ్డను ప్రత్యేక డివిజన్గా ప్రకటించకపోతే మరో ఉద్యమం చేపడతామని ఉద్యమకారులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జమ్మిగడ్డ ప్రాంతానికి చెందిన కాలనీల ప్రతినిధులు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






