03-06-2025 12:00:00 AM
- రెండోస్థానంలో సక్షమ్ జిందాల్, మహిళా అభ్యర్థుల్లో దేవదత్తమాఝీకి అగ్రస్థానం
- అర్హత సాధించిన 54,378 మందిలో హైదరాబాద్జోన్ నుంచే 12,946మంది
- మన జోన్ నుంచి టాప్ 10లో ఇద్దరు, టాప్ 100లో 23మంది
- ఫలితాలను విడుదల చేసిన ఐఐటీ కాన్పూర్
- నేటి నుంచి జోసా కౌన్సెలింగ్
హైదరాబాద్, జూన్ 2 (విజయక్రాంతి): జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలను ఐఐటీ కాన్పూ ర్ సోమవారం విడుదల చేసింది. ఈ ఫలితాల్లో ఐఐటీ ఢిల్లీ జోన్కు చెందిన రజిత్గుప్తా తొలిస్థానం దక్కించుకోగా, రెండో స్థానంలో సక్షమ్ జిందాల్ నిలిచారు. ఇక మహిళల విభాగంలో ఐఐటీ ఖరగ్పూర్ జోన్ నుంచి దేవదత్తమాఝీ అగ్రస్థానం దక్కించుకోగా కామన్ ర్యాంకింగ్లో ఆమెకు 16వ ర్యాంకు దక్కింది.
ఆలిండి యా టాపర్ రజిత్గుప్తా 360మార్కులకు గానూ 332 సాధించి అగ్రస్థానంలో నిలిచాడు. 330మార్కులతో ఐఐటీ బాంబే జోన్ విద్యార్థి మాజిద్ ముజాహిద్ హుస్సేన్ మూడో ర్యాంకు, 327 మార్కులతో పార్థ్ మందార్ వర్టాక్ 324 మార్కులతో ఐఐటీ ఢిల్లీ జోన్ విద్యార్థి ఉజ్వల్ కేసరి 321 మార్కులతో ఐఐటీ కాన్పూర్ జోన్ విద్యార్థి అక్షత్ కుమార్ 321 మార్కులతో ఐఐటీ బాంబే జోన్ నుంచి సాహిల్ ముఖేశ్ డియో 319 మార్కులతో ఐఐటీ ఢిల్లీ జోన్కు చెందిన విద్యార్థి దేవేశ్ పంకజ్ బైయ 319 మార్కులతో ఐఐటీ హైదరాబాద్ జోన్కు చెందిన విద్యార్థి అర్నవ్ సింగ్ 317 మార్కులతో వడ్లమూడి లోకేశ్ ర్యాంకు సాధించారు.
దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీల్లో బీటెక్ సీట్ల భర్తీకి మే 18న జరిగిన పరీక్షకు 1,80,422 మంది అభ్యర్థులు హాజరుకాగా వారిలో 54,378 మంది ఉత్తీర్ణులయ్యారు. అడ్వాన్స్డ్ ఫలితాలు వెలువడడంతో ఇక దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాల కోసం ఈనెల 3వ తే దీ సాయంత్రం 5 గంటల నుంచి జాయింట్ సీ ట్ అలకేషన్ అథారిటీ-(జోసా)- కౌన్సెలింగ్ జరగనుంది.
సత్తా చాటిన మన విద్యార్థులు..
జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో ఐఐటీ హైదరాబాద్ జోన్ నుంచి విద్యార్థులు సత్తాచాటారు. ఇందులోనూ మన విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. కేటగిరీ వారి ర్యాంకుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులిద్దరు టాపర్లుగా నిలిచారు. ఈడబ్ల్యూఎస్ ఆలిండియా టాపర్గా వంగాల అజయ్రెడ్డి, ఓబీసీ ఎన్సీఎల్ ఆలిండియా టాపర్గా ధర్మన జ్ఞానరుత్విక్సాయి నిలిచారు. వంగాల అజయ్రెడ్డికి ఆలిండియా 19వ ర్యాంకు, ధర్మన జ్ఞానరుత్విక్ సాయికు 18వ ర్యాంకు దక్కింది. ఐఐటీ హైదరాబాద్ జోన్ విద్యార్థి అర్నవ్ సింగ్ 319 మార్కులతో జాతీయస్థాయిలో 9వ ర్యాంకు సాధించడంతోపాటు హైదరాబాద్ జోన్ టాపర్గా నిలిచాడు. వడ్లమూడి లోకేశ్ 317 మార్కులతో పదో ర్యాంకు సాధించారు.
అర్హులైన వారిలో అబ్బాయిలే ఎక్కువ..
ఈ సారి జేఈఈ అడ్వాన్స్డ్కు 1.87లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, అందులో 1,80,422 మంది విద్యార్థులు పరీక్షలు రాశా రు. వీరిలో మొత్తం 54,378 మంది అర్హత సాధిస్తే.. అందులో అబ్బాయిలే అధికంగా ఉన్నారు. 44వేల మంది అబ్బాయిలు అర్హత సాధించగా, అమ్మాయిలు కేవలం 9,404 మంది మాత్రమే అర్హత సాధించారు. ఐఐటీ హైదరాబాద్ జోన్ పరిధిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాలు న్నాయి. ఈజోన్ నుంచి రికార్డుస్థాయిలో విద్యార్థులు అర్హత సాధించారు.
హైదరాబాద్ జోన్ నుంచి టాప్ 100లో 23 మంది
ఈ ఫలితాల్లో మన జోన్ విద్యార్థుల సత్తా చాటారు. టాప్ 10లో ఇద్దరు, టాప్ 100లో 23 మంది, టాప్ 500లో 139 మంది విద్యార్థులున్నారు. టాప్ 500లో అత్యధికంగా అర్హులైన వారిలో 145 మందితో ఐఐటీ బాంబే జోన్ తొలిస్థానంలో ఉండగా, 139 మందితో ఐఐటీ హైదరాబాద్ జోన్ నిలిచింది. కేవలం ముగ్గురితో ఐఐటీ గుహటీ చివరి స్థానంలో నిలిచింది. టాప్ 100లో హైదరాబాద్ జోన్ మూడో స్థానంలో నిలిచింది. టాప్ 10లో మూడోస్థానంలో నిలవడం విశేషం. టాప్ 200లో 57 మంది ఐఐటీ హైదరాబాద్ జోన్ విద్యార్థులే కావడం గమనార్హం. టాప్ 300లో 78 మంది, టాప్ 400లో 116 హైదరాబాద్ జోన్ విద్యార్థులున్నారు.
17వేలకు పైగా సీట్లకు ఆరు విడతల్లో కౌన్సెలింగ్..
దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీలు, ఎన్ఐటీల్లోని సీట్ల భర్తీకి నిర్వహించే జోసా కౌన్సెలింగ్ మంగళవారం నుంచి ప్రారంభంకానుంది.ఇక ఎన్ఐటీల్లో 24,229, ట్రిపుల్ ఐటీల్లో 8,546, గవర్నమెంట్ ఫండెండ్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్స్లో 9,402 చొప్పున సీట్లున్నాయి. మొత్తం ఆరు విడతల్లో కౌన్సెలింగ్ను చేపట్టి సీట్లను భర్తీచేస్తారు. మంగళవారం సాయంత్రం నుంచి మొదటి విడత ఆప్షన్లు విద్యార్థులు ఎంచుకోవచ్చు. ఈ నెల 14న మొదటి, 21న రెండో, 28న మూడో, జూలై 4న నాలుగో, జూలై 10న ఐదో, జూలై 16న ఆరో రౌండ్ సీట్లను కేటాయిస్తారు.