10-08-2025 11:39:27 PM
ప్రజలను మోసం చేసిన బిఆర్ఎస్ ప్రభుత్వం
రాష్ట్ర కార్మిక, మైనింగ్, ఉపాధి కల్పన శాఖ మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి
మందమర్రి,(విజయక్రాంతి): సింగరేణి సంస్థలో నూతన గనులను ప్రారంభించి, ఉద్యోగాలు కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని, కొత్త గనుల టెండర్ లో సింగరేణి సంస్థ పాల్గొనేలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుందని రాష్ట్ర కార్మిక, మైనింగ్, ఉపాధి కల్పన శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి తెలిపారు. ఆదివారం నియోజవర్గ పర్యటనలో భాగంగా ముందుగా పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గంలోని ప్రభుత్వ అధికారులతో ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాల పురోగతిపై రివ్యూ సమావేశం నిర్వహించారు.
ఈసందర్భంగా ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, రోడ్లు డ్రైనేజీలు తదితర పలు అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణపై పంచాయతీరాజ్, మున్సిపల్, రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పరిపాలనలో చెన్నూరు నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోలేదని ఆరోపించారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా కృషి చేస్తుందని,కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారo లోకి వచ్చిన వెంటనే పదివేల టీచర్ పోస్టులు భర్తీ చేయడం జరిగిందని, నియోజకవర్గంలో 200 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ పాఠశాలను మంజూరు చేయడం జరిగిందని గుర్తు చేశారు.
ప్రభుత్వ పాఠశాల, కళాశాలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుందని ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వ విద్యా సంస్థలలో 70 శాతం అడ్మిషన్లు పెరిగాయన్నారు. సింగరేణిలో నూతన గనులను తీసుకురావడానికి కృషిచేసి, స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. బీహార్ లో ఒక్కొక్క నియోజకవర్గంలో లక్ష దొంగ ఓట్లు నమోదు అయ్యాయని రాహుల్ గాంధీ మీడియా ముందు బహిర్గతం చేశారన్నారు. ఎన్నికలకు సంబంధించిన ఓటర్ జాబితాను ఇవ్వమని ఎన్నికల కమిషన్ ను రాహుల్ గాంధీ కోరితే డేటా డిలీట్ చేశామని ఎన్నికల కమిషన్ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.
రాష్ట్ర ప్రజల సొంతింటి కల ఆకాంక్షను గత బిఆర్ఎస్ ప్రభుత్వం నమ్మించి మోసం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, ఇందిరమ్మ ఇండ్లు పంపిణీ చేస్తున్నామని, చెన్నూరు నియోజకవర్గంలో 3800 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేశామని తెలిపారు. అదేవిధంగా చెన్నూరు నియోజకవర్గం ప్రజలకు తాగునీటి కష్టాలు తీర్చేందుకు రూ.100 కోట్లతో అమృత్ స్కీం పనులు శరవేగంగా కొనసాగుతున్నాయన్నారు. నియోజకవర్గంలో ఇసుక మాఫియా, భూ దందాలకు చెక్ పెట్టామని తెలిపారు. లక్ష కోట్ల రూపాయలతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ కమిషన్లకే పరిమితమైందని, అవే లక్ష కోట్లతో తెలంగాణలో నిరుపేదలందరికీ డబుల్ బెడ్ రూం ఇండ్లు వచ్చేవన్నారు.
కేవలం కమిషన్ల కోసమే గత బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టులు చేపట్టిందని ఆరోపించారు. దేశంలో ఎన్నికల సరళిని బ్యాలెట్ లతో కొనసాగించాలని ఎన్నికల కమిషన్ ను రాహుల్ గాంధీ కోరితే, బీజేపీ తప్పుపడు తుందని, ఈవీఎం మిషన్లు ఎన్నికల సమయంలో హాక్ అవుతున్నాయని ఆరోపించారు. ఎన్నికల ఓటింగ్ ప్రక్రియలో అవకతవకలకు తావు లేకుండా బ్యాలెట్ పద్ధతిని ప్రవేశపెట్టాలని అన్ని పార్టీలు కోరుతున్నాయని తెలిపారు.ఈ సమావేశంలో పట్టణ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.