11-08-2025 12:00:00 AM
- నిండుకొని చెరువులు... ఎండుతున్న నారుమళ్లు..
- బీల్లుగా దర్శనమిస్తున్న పంట పొలాలు.
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పరిస్థితి
భద్రాద్రి కొత్తగూడెం ఆగస్టు 10 (విజయ క్రాంతి):భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ప్రశ్నార్థకంగానే మారిందని చెప్పక తప్పదు. జిల్లావ్యాప్తంగా ఆశించిన వర్షాలు కురవక పోవడంతోచెరువులు కుంటలు వెలవెల పోతున్నాయి. చెరువుల కింద ఆయకట్టు బిళ్ళు దర్శనమిస్తున్నాయి.
వర్షాకాలం ప్రారంభమై నెల 15 రోజులు పూర్తి అయిన చెప్పుకోదగ్గ వర్షాలు కురవలేదు. దీంతో ఏ గ్రామంలో చూసినా పచ్చగా కళకళలాడాల్సిన పంట పొలాలు వెలవెల పోతున్నాయి. ప్రాజెక్టుల లో సైతం ఆశించన నీరు రాలేదు. ఇల్లందు నియోజకవర్గం టేకులపల్లి మండలం లచ్చగూడెం గ్రామంలో గల అతి పురాతన గడ్డి చెరువు జిల్లాలోని వర్షాభావ పరిస్థితిని తేటతెల్లం చేస్తుందని చెప్పవచ్చు.
ఈ చెరువు ఆయకట్టు సుమారు 600 ఎకరాల పైచిలుకు ఉంటుంది. గట్టి వాన ఒకటి, రెండు పడితే చెరువు నిండిపోతుంది. అలాంటి ఈ చెరువు నీళ్లు లేక వెలవెల పోతుంది. వర్షాధారం పైనే ఈ పంట పొలాలు ఆధారపడి ఉంటాయి. మొదట్లో వర్షాలు కురవడంతో రైతులు ఎంతో ఆశతో నార్లు పోశారు. ఆ తర్వాత వర్షాలు సక్రమంగా పడకపోవడంతో పోసిన నారుమళ్లు ఎర్రబారుతూ ఎండిపోతున్నాయి.
పంట పొలాలు సైతం దున్నే పరిస్థితి కనిపించడం లేదు. అడపా తడపా పడిన వర్షాలకు దున్నిన పొలాలు సైతం పొడిబారి పోతున్నాయి. దీంతో రైతులు వర్షం కోసం ఆకాశం వైపు ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతేకాక చెరువు కింద పంట కాలువ మెరుగు పరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది.ఇదే పరిస్థితి జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో నెలకొని ఉందని చెప్పవచ్చు.
వానలు లేక నీళ్లు రాలేదు
ఈ ఏడాది వర్షాకాలం ప్రారంభమైన నాటి నుంచి చెప్పుకోదగ్గ వర్షాలు లేకపోవడంతో గడ్డి చెరువు నిండలేదు. ఫలితంగా చెరువు కింద ఆయకట్టు బీడు గా మారింది. ఇలాంటి పరిస్థితి మూడున్నడు రాలేదు. రైతులు గంపెడు ఆశతో నార్లు పోసుకొని చెరువు నిండాక, నీరు అందక ఆందోళన చెందుతున్నారు. వ ర్షం కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తు న్నాం. ఒకటి రెండు గట్టి వర్షాలు కురిస్తే చెరువు నుండి పూర్తి ఆయకట్టుకు చివరి వరకు సాగునీరు అందుతుంది.
కల్తీ మల్లయ్య రైతు