calender_icon.png 25 September, 2025 | 6:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిర్మల్ లో దొడ్డి దారిన ఉద్యోగాల భర్తీ

25-09-2025 05:08:24 PM

తెలంగాణ నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మహిపాల్ యాదవ్

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో దొడ్డి దారిన బ్యాక్ లాగ్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారని తెలంగాణ నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మహిపాల్ యాదవ్ ఆరోపించారు. గురువారం నిర్మల్ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వ పాలన నుంచి వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ బ్యాక్ లాగ్ పోస్టులను గుట్టు చప్పుడు కాకుండా  దొడ్డి దారిలో భర్తీలు జరుగుతున్నాయన్నారు. మా దృష్టికి వచ్చిందన్నారు.

గతంలో కూడా నిర్మల్ మున్సిపల్ లో ఏకంగా 44 పోస్టులు భర్తీ చేయడం జరిగిందన్నారు. దీనికి ఎంక్వైరీ కమిటీ అధికారిక ఆర్డీవోను నియమించి, ఉద్యోగాలలో జరిగిన అవకతవకల గురించి పూర్తిస్థాయిలో నివేదిక ఇవ్వాలని చెప్పారు. కానీ ఇప్పటివరకు ఎటువంటి నివేదిక ఇవ్వలేదన్నారు. 44 ఉద్యోగాలను అంగట్లో వేలం వేసి అమ్ముకున్నారని మండిపడ్డారు. ఒక్కో పోస్టు కు లక్షల్లో వసూలు చేసినట్టు సమాచారం ఉందన్నారు.

2018 సంవత్సరంలో జేన్కోలో ఎటువంటి నోటిఫికేషన్ లేకుండా  కాంటాక్ట్ ఒప్పందంపై ఉద్యోగాలను భర్తీ చేసి, 2022లో పర్మినెంట్ చేశారన్నారు. వీరి వద్ద నుంచి ఒక్కో పోస్టుకు రూ .30 లక్షల దాకా డిమాండ్ చేసినట్టు  ఆరోపించారు ఇప్పటికైనా ప్రభుత్వం దొడ్డిదారిన జరిగే బ్యాక్ లాగ్ నియామకలను అడ్డుకొని ,నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇందులో విద్యార్థి నాయకులు కాశి, రాహుల్, సిద్ధార్థ, తదితరులు ఉన్నారు.