25-06-2025 01:54:06 AM
- ఇప్పటికే 56 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం
- రైతు సంక్షేమం కోసం రూ.70 వేల కోట్లు ఖర్చు చేశాం
- డిప్యూటీ సీఎం భట్టి వెల్లడి
హైదరాబాద్, జూన్ 24 (విజయక్రాంతి): కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తర్వాత ఇప్పటికే 56 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని, మరో 30 వేల ఉద్యోగాలను త్వరలో భర్తీ చేయనునున్నట్టు డిప్యూటీ సీఎం తెలిపారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ప్రక్షాళన చేసి, జాబ్ క్యాలెండర్ విడుదల చేశామన్నారు.
పీఏసీ సమావేశం అనంతరం మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరితో కలిసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వ చేపడుతున్న సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలపై పీసీసీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ హర్షం వ్యక్తం చేసిందని, ఇది గోల్డెన్ పీరియడ్ అని అభినందించినట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. బూత్, మండల, జిల్లా స్థాయి వరకు పార్టీని మరింత బలోపేతం, ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ఇంటింటికి తీసుకెళ్లేందుకు పటిష్ట వ్యవస్థను ఏర్పాటు చేయాలని పీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.
పదేళ్లు అధికారంలో ఉండి, కులగణన సర్వేలో పాల్గొనని వారు.. తమ ప్రభుత్వం చేపట్టిన బీసీ కులగణన సర్వే గురించి మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించడమేనని మండిపడ్డారు. ఈ వానాకాలం సీజన్లో పంటల కు పెట్టుబడి సాయం కింద 9 రోజుల్లో రూ.9 వేల కోట్లు రైతు భరోసా నిధులు జమ చేశామన్నారు. 24 గంటల ఉచిత విద్యుత్ పథకం కింద నెలకు రూ.900 కోట్ల చొప్పున ఇప్పటివరకు రూ.17,091 వేల కోట్లు చెల్లించామని తెలిపారు.
రైతు రుణమాఫీ కింద రాష్ర్టంలోని 25.36 లక్షల మంది రైతులకు రూ.21,763 కోట్లు చెల్లించామని, సన్నవరికి బోనస్ కింద రూ.1,199 కోట్లు రైతులకిచ్చినట్టు చెప్పారు. ఇందిరా గిరి వికాసం పథకం కింద 2.1 లక్షల గిరిజన రైతులకు సోలార్ విద్యుత్తో నడిచే సాగునీటి పంపుసెట్లు, స్ప్రింక్లర్లను ఉచితంగా అంచామన్నారు. అవకాడో, వెదురు పామాయిల్ వంటి మొక్కలను ఉచితంగా గిరిజన రైతులకు అందిస్తున్నామని, ఇందుకుగాను రూ.12,600 కోట్లు కేటాయించినట్లు చెప్పా రు.
ప్రతి సంవత్సరం రైతుల కోసం రూ.70 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని, ఐదేళ్ల కాలం లో రైతుల కోసం రూ.3.50 లక్షల కోట్లు ఖర్చు చేసి తీరుతామన్నారు. మహిళలకు రూ.21,600 కోట్ల వడ్డీలేని రుణాలు అందించామని, రాజీవ్ యువ వికాసం కింద రూ.9 వేల కోట్లు ఖర్చు చేయనున్నట్టు తెలిపారు. 3.10 కోట్ల మంది పేదలకు అందిస్తున్న సన్న బియ్యం కోసం ఏటా రూ.13,525 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు చెప్పారు.