మరణించిన టీచర్కు ఉద్యోగోన్నతి!
- భద్రాద్రి జిల్లాలో పాఠశాల విద్యాశాఖ నిర్వాకం
- బతికున్నప్పుడు దరఖాస్తు చేసుకున్నడు: దమ్మపేట ఎంఈవో లక్ష్మీ
భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 23 (విజయక్రాంతి): మరణించిన ఉపాధ్యాయుడికి ఉద్యోగోన్నతి కల్పించిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో చర్చనీయంశంగా మారింది. పాఠశాల విద్యాశాఖ నిర్వాకంతో అందరూ నివ్వెరపోతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం చెలమప్పగూడెం ఎంపీయూపీఎస్లో పనిచేస్తున్న ఏవీ శ్రీనివాస్రావు (ఐడీ నం 1630168) కు ఉద్యోగోన్నతి కల్పించి, అశ్వారావుపేట జెడ్పీహెచ్ఎస్ పాఠశాలకు కేటాయించారు. ఆయన వెబ్ ఆప్షన్ నమోదు చేయకపోయినా ప్రమోషన్ కల్పించడం గమనార్హం. నిజానికి ఆయన ౨౦౨౩ ఫిబ్రవరి ౧౧న మృతిచెందాడు.
16 నెలల క్రితం మరణించిన ఉపాధ్యాయుడికి ప్రమోషన్ ఇవ్వడం జిల్లాలో తీవ్ర చర్చనీయాంశమైంది. జిల్లా విద్యాశాఖ కార్యాలయ సిబ్బంది సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయుల వివరాలను పరిశీలించకుండా, అదీ ప్రమోషన్ కల్పించేందుకు ఎంత మందికి అర్హ త ఉంది అనేది పరిశీలించకుండా మరణించిన ఉపాధ్యాయునికి ప్రమోషన్ ఇవ్వడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నెల 8 నుంచి రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటి వరకు మల్టీజోన్ 10,083 మంది, మల్టీజోన్ 768 మంది మొత్తం 10,851 మంది ఉపాధ్యాయులకు ప్రమోషన్లు కల్పించారు. మల్టీజోన్ వారం రోజుల్లో మరో 8 వేల మందికి ప్రమోషన్లు కల్పించే దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారు.
మరణించక ముందు ఆన్లైన్లో దరఖాస్తు: లక్ష్మీ, ఎంఈవో, దమ్మపేట
ఏవీ శ్రీనివాసరావు మరణించకముందు ప్రమోషన్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారని దమ్మపేట మండల విద్యాధికారి లక్ష్మీ తెలిపారు. ఆన్లైన్లో చేసిన దరఖాస్తును ఎంఆర్సీ, డీఈవో కార్యాలయాల్లో సరిచేయడం కుదరదని చెప్పారు. రాష్ట్ర విద్యాశాఖ కార్యాలయం నుంచి ప్రమోషన్ జారీ చేశారని తెలిపారు. ఉపాధ్యాయులు కోరుకున్న తర్వాత మిగిలిన పోస్టుల్లో ఆప్షన్ కోరుకోకున్నా అర్హత ఆధారంగా ఆర్డర్ ఇచ్చారని చెప్పారు.






