07-06-2025 01:10:04 AM
హైదరాబాద్, జూన్ 6 (విజయక్రాంతి): గడిచిన ఏడాది కాలంలో 4,100 మంది ఉద్యోగాలు పొందడంలో తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) క్రియాశీలకంగా వ్యవహరించడంపై ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డీ శ్రీధర్బాబు హర్షం వ్యక్తం చేశారు. టాస్క్ చేపడుతున్న కార్యక్రమాలపై శుక్రవారం సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ఈ విద్యాసంవత్సరంలో కనీసం 6 వేల మంది నిరుద్యోగుల కు అధునాతన సాంకేతిక శిక్షణ అందించి ప్లేస్మెంట్స్ కల్పించేలా భారీ లక్ష్యం నిర్దేశించుకోవాలని టాస్క్ అధికారులను ఆదేశిం చారు. నిరుద్యోగులకు, విద్యార్థులకు నైపుణ్యాలను అందించడంలో టాస్క్ గణనీ యమైన పురోగతి సాధించిందని తెలిపారు.
ఇండస్ట్రీ అవసరాలకు తగిన విధంగా ఆయా స్కిల్స్లో శిక్షణ అందించి ఉద్యోగాలు పొం దడంలో సహాయం చేస్తోందని చెప్పారు. గడిచిన ఏడాది కాలంలో టాస్క్ సంస్థ రికార్డుస్థాయిలో 1,37,677 మంది విద్యార్థులు, 2,791మంది ఫ్యాకల్టీ సభ్యులకు వివిధ సాంకేతిక, నైపుణ్య అంశాల్లో శిక్షణ అందించిందని వెల్లడించారు.
21 జిల్లాల్లోని 148 కళాశాలలు, పలు కంపెనీల ప్రాంగణాల్లో నిర్వహించిన జాబ్మేళాల్లో 4,100మంది ప్రతిభావంతులు ఉద్యోగాలు పొందడంలో టాస్క్ కీలక పాత్ర పోషించిందని అభినందించారు.
టాస్క్.. ఘనతలు ఇవీ
వెరిస్క్ ఎనలైటిక్స్ అనే అమెరికన్ కంపెనీ హైదరాబాద్ క్యాంపస్ కోసం ఏడాదికి రూ.11లక్షల ప్యాకేజీతో సాంకేతిక నిపు ణులను ఎంపిక చేసుకుంది. ఉద్యోగాలు సాధించిన మొత్తం 4,100మందిలో కనీస వార్షిక ప్యాకేజీ రూ.2.4లక్షలుగా ఉంది. హ్యుందాయ్ మోబిస్ సంస్థ టాస్క్ ద్వారా 42 మందికి శిక్షణ అందించి ఉద్యోగాల్లో నియమించుకున్నది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ స్విట్జర్లాండ్ రూ.6లక్షల వార్షిక ప్యాకేజీతో 63 మందిని రిక్రూట్ చేసుకుంది.
1ఎం1బీ(వన్ మిలియన్ ఫర్ వన్ బిలియన్) ఫౌండేషన్ తెలంగాణలో ఏర్పాటు చేసిన గ్రీన్సిగ్నల్ అకాడమీ ద్వారా మేడ్చల్, సంగారెడ్డి, నిజామాబాద్, కామారెడ్డి, మం చిర్యాల జిల్లాల నుంచి 7వేల మంది విద్యార్థులు శిక్షణ పొందారు. వీరిలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన నలుగురు ఐక్యరాజ్యసమితి 2024డిసెంబర్లో న్యూయార్క్లో నిర్వహించిన గ్లోబల్ సదస్సుకు హాజరయ్యారు.
అంగవైకల్యం ఉన్న యువతకు వివిధ నైపుణ్యాల్లో శిక్షణనిచ్చి ఉద్యోగాలు పొందేలా సాయపడేందుకు ఎంట్రప్రెన్యూర్లుగా ఎదిగేందుకు టాటా ట్రస్ట్తో టాస్క్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. దీని కింద మూడేళ్ల పాటు టాటా సంస్థ శిక్షణ కార్యక్రమాలు చేపడుతోంది. యానిమేషన్, గేమింగ్, వీఎఫ్ఎక్స్, కామిక్స్లో యువతకు 3 ఏళ్లపాటు శిక్షణ ఇచ్చేందుకు ట్వాగా అనే సంస్థతో టాస్క్ అవగాహన ఒప్పందం కుదర్చుకుంది.
వచ్చే మూడేళ్లలో ఎక్స్ఆర్ మాంక్ అనే కంపెనీ ద్వారా 10 వేల మంది విద్యార్థులకు వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ, మిక్స్డ్ రియాలిటీలో అత్యాధునిక శిక్షణ కోసం ఎంవోయూ చేసుకుంది. మొదటి విడతగా 500 మంది ప్రభుత్వ ఉద్యోగులకు మైక్రోసాఫ్ట్ ఏఐ టూల్స్ వినియోగంలో వర్క్షాప్ నిర్వహించింది.