17-10-2025 11:50:58 PM
బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్
కుత్బుల్లాపూర్,(విజయక్రాంతి): నిజమైన సంస్కృతీ, సాంప్రదాయాల పునరజ్జీవన యాత్ర ధర్మ విజయ యాత్ర అని బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి. వివేకానంద్ పేర్కొన్నారు. సనాతన ధర్మ పరిరక్షణ, ప్రచారం, ప్రజల్లో ఆధ్యాత్మిక చైతన్యం కలిగించడమే లక్ష్యంగా శృంగేరీ శారదా పీఠాధిపతి శ్రీ విధుశేఖర భారతీ మహాస్వామి ఆధ్వర్యంలో చేపట్టిన ధర్మ విజయ యాత్ర శుక్రవారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధి కొంపల్లి ఎన్సీఎల్ కాలనీకి చేరుకుంది. ఈ సందర్భంగా నిర్వహించిన స్వాగత సేవలో భాగంగా బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ కుటుంబసమేతంగా హాజరై శ్రీ విధుశేఖర భారతీ మహాస్వామికి ఘనస్వాగతం పలికి జగద్గురుల అనుగ్రహభాషణంలో పాల్గొనగా శ్రీ విధుశేఖర భారతీ మహాస్వామి ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ దంపతులకు దివ్యాశీస్సులను అందజేశారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ... వేద, శాస్త్ర, ఉపనిషత్తులపై విశాలమైన పరిజ్ఞానం కలిగిన శ్రీ విధుశేఖర భారతీ మహాస్వామి మా కుత్బుల్లాపూర్ ప్రాంతానికి రావడం ఎంతో సంతోషకరమైన విషయమని, ప్రజల్లో ఆధ్యాత్మిక చైతన్యానికి చేపట్టిన ఈ యాత్ర ద్వారా సనాతన ధర్మ పరిరక్షణ, మనలోని సద్గుణాలు, సత్సంకల్పాలు పెంపొందించాలన్నారు.ఈ కార్యక్రమంలో నిర్వాహకులు రాచర్ల హైందవి - రవిచంద్ర శర్మ, మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్, ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మా రెడ్డి, కె.వెంకట్ రాంరెడ్డి, కొంపల్లి మాజీ మున్సిపల్ చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్, బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ శిరీష ప్రవీణ్ రావు తదితరులు పాల్గొన్నారు.