కాంగ్రెస్తోనే పట్టభద్రులకు న్యాయం
బీఆర్ఎస్ హయాంలో నాపై అక్రమ కేసులు
పట్టభద్రుల సమస్యల పరిష్కారం కోసమే నేను పోటీలోకి..
పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న
ఇల్లెందు, మే 20: కాంగ్రెస్తోనే పట్టభద్రులకు న్యాయం జరుగుతుందని పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అన్నారు. భద్రాద్రి జిల్లా ఇల్లెందులో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లా డారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలిస్తామని మోసం చేసిన బీజేపి పార్టీ నుంచి ఒకరు, తెలంగాణలో ఉపాధ్యాయులు, విద్యార్థులకు అన్యాయం చేసిన బీఆర్ఎస్ నుంచి మరొకరు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీలో ఉన్నారని, వారిని నమ్మి ఓటు వేస్తే నట్టేట ముంచుతారన్నారు. బీఆర్ఎస్ పాలకుల అవినీతి అక్రమాలను తన చానల్ ద్వారా బయటపెట్టాననే కక్షతో తనపై 72 కేసులు బనాయించారన్నారు.
తాను ప్రజాపక్షాన పోరాటం చేస్తానని, కేసులకు భయపడనని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ అమెరికా నుంచి కాదు, అంతరిక్షం నుంచి అభ్యర్థిని దింపినా గెలుపు తనదేనని స్పష్టం చేశారు. విద్యావంతుల హక్కుల సాధన కోసమే తాను పోటీలో ఉన్నట్లు ప్రకటించారు. ఎన్నికల కోడ్ ముగిసిన కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్తో పాటు గురుకులాల పీఈటీ ఉద్యోగాలకు నియామక పత్రాలు అందజేస్తుందన్నారు. కార్యక్రమంలో ఇల్లెందు ఎమ్మేల్యే కోరం కనకయ్య, పార్టీ నేతలు మువ్వా విజయ్బాబు, ఇల్లెందు మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, నాయకులు తుళ్లూరి బ్రహ్మయ్య, దొడ్డా డానియల్ పాల్గొన్నారు.






