మొబైల్స్ రికవరీలో ప్రథమ స్థానంలో కామారెడ్డి
కామారెడ్డి, మే 28,(విజయ క్రాంతి): మొబైల్స్ రికవరీలో కమిషనరేట్లు మినహాయిస్తే.. కామారెడ్డి జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 3,150 ఫోన్లు రికవరీ చేశామని స్పష్టం చేశారు.
పలువురు పోగొట్టుకున్న రూ.15లక్షల విలువైన 107 మొబైల్స్ వివిధ ప్రాంతాల నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్లను బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో (District Police Office) ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. సెల్ఫోన్లను అశ్రద్ధ చేస్తే వ్యక్తిగత, సామాజిక భద్రతకు భంగం కలుగుతుందన్నారు.
మొబైల్ పోయినా, చోరీకి గురైనా వెంటనే సంబంధిత పోలీస్స్టేషన్కు (police station) వెళ్లి దరఖాస్తు ఇవ్వాలని, సిమ్ కార్డ్ బ్లాక్ చేసి అదే నంబర్తో కొత్తసిమ్ తీసుకోవాలని సూచించారు. ఫోన్ పోతే ఆందోళన చెందవద్దని, సీఈఐఆర్ (CEIR) ద్వారా ఫోన్ రికవరీ చేయవచ్చన్నారు. ఈ సందర్భంగా 107 మొబైల్ ఫోన్ల రికవరీ చేయడంలో ప్రతిభ చూపిన టీం సభ్యులను ఎస్పీ అభినందించారు.






