4 July, 2026 | 5:31 PM

‘కంగారూ’లను సంప్రదించలేదు: జై షా

25-05-2024 02:04 AM

ముంబై: టీమిండియా ప్రధాన కోచ్ పదవి కోసం ఆసీస్ మాజీ క్రికెటర్లను సంప్రదించినట్లు వస్తున్న వార్తలను బీసీసీఐ కార్యదర్శి జై షా ఖండించాడు. హెడ్ కోచ్ పదవి విషయమై తాము ఏ ఆసీస్ క్రికెటర్‌ను స్పందించలేదని తెలిపాడు. రాహుల్ ద్రవిడ్ అనంతరం ప్రధాన కోచ్ బాధ్యతలు చేపట్టే వ్యక్తి భారత క్రికెట్ మూలాలు తెలిసిన వారు అయితే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. పొట్టి ప్రపంచకప్ అనంతరం ప్రస్తుత కోచ్ రాహుల్ ద్రవిడ్ ఆ బాధ్యతల నుంచి తప్పుకోనున్నాడు. కోచ్ పదవికి దరఖాస్తు చేసుకునేందుకు మరో మూడు రోజులు మాత్రమే గడువు మిగిలి ఉన్న నేపథ్యంలో జై షా మాట్లాడుతూ.. ‘నేను లేదా బీసీసీఐ ఆఫీస్ బేరర్లు ఎవరూ కూడా ప్రధాన కోచ్ పదవి కోసం ఆసీస్ మాజీ క్రికెటర్లను సంప్రదించలేదు. కొన్ని మీడియా సెక్షన్లలో వస్తున్న వార్తలన్నీ అవాస్తవం.

లాంగర్ చేసిన వ్యాఖ్యలు అతడి విజ్ఞతకే వదిలేస్తున్నా. ఇక భారత జట్టు ప్రధాన కోచ్‌గా సరైన వ్యక్తిని ఎంపిక చేయనున్నాం. టీమిండియా క్రికెట్  స్వరూపాన్ని సరిగ్గా అర్థం చేసుకున్న వారి కోసం అన్వేషిస్తున్నాం. వారి నైపుణ్యంతో జట్టును ఉన్నత శిఖరాలకు చేర్చేవారినే కోచ్ పదవికి ఎంపిక చేస్తాం. ఇది మొత్తం ఒక ప్రక్రియ ప్రకారం జరగనుంది. దేశవాళీ క్రికెట్ గురించి సరిగ్గా తెలియకపోతే కొత్త కోచ్‌కు ఇబ్బందిగా మారుతుంది. ఇలాంటి విషయాల్లో చురుకుగా వ్యవహరించే వ్యక్తినే ప్రధాన కోచ్‌గా తీసుకొచ్చేందుకు మొగ్గుచూపుతాం’ అని పేర్కొన్నాడు. ప్రస్తుత టీమిండియా ప్రధాన కోచ్‌గా ఉన్న ద్రవిడ్ మరోసారి ఆ పదవిలో కొనసాగేందుకు ఆసక్తి చూపడం లేదు. దీంతో ద్రవిడ్‌కు సరిసమానమై కోచ్ కోసం బీసీసీఐ అన్వేషన కొనసాగిస్తోంది. భారత ప్రధాన కోచ్ పదవి కోసం మే 27 వరకు దరఖాస్తుల స్వీకరణ జరగనుంది. అయితే ఆ పదవికి ఎవరు దరఖాస్తు చేసుకున్నారన్న విషయంపై స్పష్టత రాలేదు. ఇక టీమిండియా హెడ్‌కోచ్ పదవి రేసులో గౌతమ్ గంభీర్, స్టీఫెన్ ప్లెమింగ్, జయవర్ధనే ఉన్నట్లు తెలుస్తోంది.