15-05-2025 12:17:07 AM
న్యూఢిల్లీ, మే 14: పహల్గాంలో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ చేపట్టిన విషయం తెలిసిందే. ఇందుకు ప్రతిగా పాక్ ప్రతిస్పందించే అవకాశం ఉందని కనిపెట్టిన భారత నౌకాదళం సముద్ర సంసిద్ధతను గణనీయంగా పెంచింది.
ఇందులో భాగంగా పాక్లోని కరాచీ నౌకాశ్రయమే లక్ష్యంగా ఐఎన్ఎస్ విక్రాంత్, బ్రహ్మోస్ క్షిపణులతో కూడిన యుద్ధనౌకలు, జలాంతర్గాములను భారీగా మొహరించినట్టు అధికారవర్గాలు వెల్లడించాయి. వీటి మోహరిపుతోనే ఆపరేషన్ సిందూర్ విజయవంతమైందని పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాక్పై త్రిముఖ ఒత్తిడి వ్యూహాన్ని ప్రయోగించామని నావికాదశ అధికారులు స్పష్టంచేశారు.
కరాచీ పోర్ట్ను లక్ష్యంగా చేసుకొని 36 ఫ్రంట్లైన్ నావికాదళాలను రంగంలోకి దింపినట్టు తెలిపారు. వీటిలో బ్రహ్మోస్ క్షిపణులతో కూడిన ఏడు డిస్ట్రాయర్లు, మీడియం రేంజ్ సర్పేస్- టు-ఎయిర్ క్షిపణులు, వరుణాస్త్ర హెవీవెయిట్ టార్పెడోలు ఉన్నట్టు చెప్పారు. అలాగే కొత్తగా ప్రవేశపెట్టిన ఐఎన్ఎస్ తుషిల్తో సహా ఏడు స్టెల్త్ గైడెడ్ క్షిపణి యుద్ధ నౌకలను సైతం బరిలోకి దించినట్టు పేర్కొన్నారు.
మరోవైపు, ఐఎన్ఎస్ విక్రాంత్, బ్రహ్మోస్ క్షిపణులతో కరాచీ పోర్ట్ను అష్టదిగ్బంధనం చేయడంతోనే వారి నావికాదళం సమర్థవంతంగా స్పందించలేకపోయిందన్నారు. కేవలం నౌకాశ్రయానికి పరిమితమవ్వాల్సి వచ్చిందని ఇండియన్ నేవీ చెప్పుకొచ్చింది. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయ వాణిజ్య నౌకలు తమ దారిని మళ్లించుకున్నాయని తెలిపారు.