16-06-2025 12:54:07 AM
కరీంనగర్, జూన్ 15 (విజయక్రాంతి): గత ప్రభుత్వం ఆర్భాటంగా కరీంనగర్ జిల్లా కేంద్రంలో ప్రారంభించిన ప్రభుత్వ వైద్య కళాశాల ప్రస్తుతం వెంటిలేటర్పై ఉంది. ఈ ఏడాదైనా మెడిసిన్ అడ్మిషన్లకు జాతీయ విద్యా కమిషన్ అనుమతులిస్తుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రం లో 26 కొత్త జిల్లా కేంద్రాల్లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ఏర్పా టు చేసింది.
కరీంనగర్లో 2023, జూన్లో కళాశాల మంజూరు కాగా, 2023-24, సెప్టెంబర్లో తరగతులు షురువయ్యాయి. కాలేజీకి నూతన భవన నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వం రూ.138 కోట్లు మంజూరు చేసింది. కరీంనగర్ సమీపంలోని విత్తనాభివృద్ధి సంస్థకు చెందిన 25 ఎకరాల స్థలాన్ని నిర్మాణానికి కేటాయించారు.
అయితే ఆదరాబాదరాగా కళాశాల ఏర్పాటు చేయాలనే ఆలోచనతో రూ.7 కోట్లతో విత్తనోత్పత్తి సంస్థకు చెందిన గోదాములను ఆధునీకరించి, అందులోనే తరగతులు నిర్వహిస్తున్నారు. మొదటి సంవత్సరం వంద మందికి, రెండో విద్యా సంవత్సరం వందమందికి ప్రవేశాలు కల్పించారు. అయితే ప్రస్తుతం రెండు బ్యాచులలో కలిపి 84 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నా రు.
పలు జిల్లా కేంద్రాల్లో కాలేజీల భవన నిర్మాణాలు పూర్తికాగా కరీంనగర్లో ఇప్పటికీ ఒక రూపం రాలేదు. గోదాములలో తాత్కాలిక వసతి ఏర్పాటు చేసి తరగతులు నిర్వహిస్తుండగా, ఇక్కడ హాస్టల్ సదుపాయం లేక బాలురు, బాలికలకు వేర్వేరు చోట్ల హాస్టళ్లు ఏర్పాటు చేశారు. తీగల గుట్టపల్లిలోని ఒక ప్రైవేట్ భవనంలో బాలికల హాస్టల్ను కొనసాగిస్తున్నారు. ఒక బాలుర బ్యాచ్ విద్యానగర్లో, మరో బ్యాచ్కు శ్రీపు రం కాలనీలో హాస్టల్ నిర్వహిస్తున్నారు.
అయితే కళాశాలకు రావడానికి కేవలం ఒక బస్సు మాత్రమే అందుబాటులో ఉంది. నా లుగు బస్సులు వేస్తేగానీ విద్యార్థులు సమయానికి కాలేజీకి చేరుకోలేరు. మెడికోలు రవాణా సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారు. కళాశాల పరిస్థితి ఇలా ఉంటే బో ధన, బోధనేతర సిబ్బంది పోస్టులు చాలామట్టుకు ఖాళీగా ఉన్నాయి.
ఎన్ఎంసీ నిబంధ నల ప్రకారం 27 ప్రొఫెసర్ పోస్టులు ఉండా ల్సి ఉండగా, 10 మందే పనిచేస్తున్నారు. అ సోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు 30కి గానూ 17 మంది, 7 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 45 సీనియర్ రెసిడెన్స్ పోస్టులకు 30 మంది, 25 ట్యూటర్ పోస్టులకు 15 మంది మాత్రమే పనిచేస్తున్నారు.
మీరే కళాశాలకు వెళ్లి చూసుకోండి..
కరీంనగర్ ప్రభుత్వ కళాశాలలో నెలకొన్న పరిస్థితులపై కళాశాల ప్రిన్సిపల్ కవిత వివరణ కోసం విజయక్రాంతి ప్రయత్నించగా ఆమె సెలవులో ఉన్నారు. ఫోన్ ద్వారా తెలుసుకొనే ప్రయత్నం చేసినప్పటికీ ‘ఫ్యాకల్టీ స్థానికంగా ఎలా ఉంటారు, ఉండరు, ఇన్ని కళాశాలలు ఉంటే ఫ్యాకల్టీ ఎలా వస్తారు’ అంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. ‘మీరు కళాశాలకు వెళ్లండి, చూసుకోండి, అక్కడ మావాళ్లు ఉంటారు ఏమైనా అడగాలంటే అడగండి’ అంటూ సమాధా నమిచ్చారు.
హైదరాబాద్ నుంచి రాకపోకలు..
చాలామంది ఉద్యోగులు హైదరాబాద్ నుంచి రాకపోకలు సాగిస్తుండటంతో బోధనలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అడ్మినిస్ట్రేషన్ విభాగంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. కాలేజీ ప్రిన్సిపల్ తరచూ సెలవుల్లో ఉండటంతో తరగతుల నిర్వహణ, పరిపాలనపై ప్రభావం పడుతోంది. కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో మెడికల్ కళాశాల విద్యార్థులకు ప్రాక్టీకల్స్ నిర్వహిస్తుంటారు.
వైద్య శిక్షణ ఇతరత్రా శిక్షణతోపాటు పోస్టుమార్టం విభాగంలో కూడా వీరికి శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ కూడా సరైన సహకారం లభించడం లేదు. కళాశాలలో పనిచేస్తున్న ఒక అధికారి ఔట్ సోర్సిం గ్ ఉద్యోగాల నియామకంలో చేతివాటం ప్రదర్శించడంతో ఇటీవలే జిల్లా కలెక్టర్ ఒక కమిటీని ఏర్పాటు చేసి, విచారణ ప్రారంభించగా నివ్వెరపోయే నిజాలు బయటకు వస్తు న్నాయి.
అధికారి కుటుంబ సభ్యులు ఔట్ సోర్సింగ్ ద్వారా ఉద్యోగాలు చేస్తున్నట్టు బహిర్గతమైంది. ఇక్కడ కళాశాలను నడిపించాల్సిన అధికారే తరచు సెలవుల్లో ఉండటంతో కళాశాలపై ప్రభావం పడుతుందని మెడికోలు వాపోతున్నారు.