29-07-2025 12:51:26 AM
కేంద్ర మంత్రి గడ్కరీని కోరిన బండి సంజయ్
జగిత్యాల అర్బన్, జూలై 28(విజయ క్రాంతి): దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న కరీంనగర్-జగిత్యాల జాతీయ రహదారి విస్తరణ పనులను వెంటనే ప్రారంభించాలని కోరుతూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి విజ్ఝప్తి చేశారు. న్యూఢిల్లీలో సోమవారం నితిన్ గడ్కరీని కలిసిన బండి సంజయ్ కుమార్ కరీంనగర్-జగిత్యాల విస్తరణ పనులతోపాటు సెంట్రల్ రోడ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్ (సీఆర్ఐఎఫ్) మంజూరు అంశాలపైనా చర్చించారు.
కరీంనగర్ నుండి జగిత్యాల వరకు 4 లేన్ విస్తరణ కోసం గత ఎన్నికలకు ముందే కేంద్రం రూ.2151 కోట్ల 35 లక్షల నిధులతో ప్రతిపాదనలు రూపొందించిన విషయాన్ని గుర్తు చేశారు. ఆయా ప్రతిపాదనలకు ఆమోదం పొందడంతోపాటు టెండర్ ప్రక్రియను కూడా ప్రారంభిస్తామని అధికారులు చెప్పినా నేటికీ టెండర్ ప్రక్రియ ప్రారంభం కాని విషయాన్ని గడ్కరీ ద్రుష్టికి తీసుకెళ్లారు.
వెంటనే సంబంధిత శాఖ ఉన్నతాధికారులను పిలిపించిన గడ్కరీ అందుకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుండి వచ్చిన అభ్యంతరాలు, న్యాయపరమైన అడ్డంకుల నేపథ్యంలోనే కరీంనగర్- జగిత్యాల రోడ్డు విస్తరణ పనులకు ఆటంకం ఏర్పడిందని తెలిపారు. ప్రస్తుతం ఆయా అడ్డంకులన్నీ అధిగమించి నివేదికను కమిటీకి పంపించామని తెలిపారు. ఆ కమిటీ నివేదిక ఇచ్చిన వెంటనే రోడ్డు పనులకు సంబంధించి టెండర్ ప్రక్రియను పూర్తి చేసి అతి త్వరలోనే విస్తరణ పనులకు శ్రీకారం చుడతామనిహామీఇచ్చారు.