కంటి వెలుగులకు… మినీ మొబైల్ హాస్పిటల్ వినియోగం
* దేశంలోనే మొట్టమొదటి సాంకేతిక మినీ మొబైల్ హాస్పిటల్
* పేషెంట్లకు కంటి పరీక్షలతో పాటు సీబీపీ, ఈసీజీ, డిజిటల్ ఎక్స్రే పరీక్షలు
* కంటి శిబిరాలకు హాజరై నిరాశతో వెనుతిరిగే వారికి పూర్తి ఆరోగ్య పరీక్షలు
* మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మునుగోడు,(విజయక్రాంతి): ఉచిత కంటి వైద్య శిబిరాలకు హాజరై ఇతర రుగ్మతల కారణంగా ఆపరేషన్లకు ఎంపిక కాకుండా వెనుతిరిగి వెళ్తున్న ప్రతి ఒక్కరికీ పూర్తి స్థాయి ఆరోగ్య పరీక్షలు అందించాలనే ఉద్దేశంతో దేశంలోనే మొట్టమొదటి సాంకేతికత కలిగిన మినీ మొబైల్ హాస్పిటల్ ఏర్పాటుకు కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శ్రీకారం చుట్టారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ మినీ మొబైల్ హాస్పిటల్ను స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు.
మునుగోడు నియోజకవర్గ ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా అత్యాధునిక సాంకేతికతతో కూడిన ఈ మినీ మొబైల్ ఆసుపత్రిని ప్రారంభించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. తన మాతృమూర్తి పేరిట నడుస్తున్న కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత కంటి వైద్య శిబిరాల కార్యక్రమంలో భాగంగా ఈ సదుపాయాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు.మునుగోడు నియోజకవర్గంలో ఇప్పటివరకు 12 విడతలుగా ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహించి 9,034 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా, అందులో 1,970 మందికి విజయవంతంగా కంటి ఆపరేషన్లు చేశారు.
ప్రస్తుతం నిర్వహిస్తున్న 13వ విడత ఉచిత కంటి వైద్య శిబిరంలో మినీ మొబైల్ ఆసుపత్రిని వినియోగిస్తూ ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు.ఈ మినీ మొబైల్ ఆసుపత్రిలో కంటి పరీక్షలతో పాటు సీబీపీ, ఈసీజీ, డిజిటల్ ఎక్స్రే వంటి వివిధ రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలను అక్కడికక్కడే నిర్వహిస్తున్నారు. శిబిరానికి వచ్చే ప్రతి పేషెంట్కు ఉచితంగా కంటి పరీక్షలు, అవసరమైన చికిత్సలు అందించడంతో పాటు భోజన సదుపాయం కల్పించి, అనంతరం వారి ఇళ్ల వరకు చేరవేసే ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సేవలను అభినందిస్తూ ప్రజలు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.




