తండ్రీ కొడుకులకు సమన్లు

02-05-2024 12:10:00 AM

ప్రజ్వల్‌కు కూడా నోటీసులు

అశ్లీల వీడియోల కేసులో విచారణకు రావాలని ఆదేశాలు

కర్ణాటక డీజీపీకి మహిళా కమిషన్ నోటీసులు

బెంగళూరు, మే 1: అశ్లీల వీడియోల కేసు లో ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ, ఆయన తండ్రి రేవణ్ణకు సిట్ సమన్లు జారీ చేసింది. లైంగిక దాడి కేసులో విచారణకు హాజరు కావాలని తెలిపినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. రేవణ్ణ ఇంటిలో పనిచేసిన మహిళ ఫిర్యాదు ఆధారంగా తండ్రీకొడుకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. కర్ణాటక ప్రభుత్వ ఆదేశాలతో అదనపు డీజీపీ బీకే సింగ్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.  

మహిళా కమిషన్ నోటీసులు

మరోవైపు ప్రజ్వల్ ఉదంతంపై అన్ని వివరాలతో సహా మూడు రోజుల్లో సమగ్ర నివే దిక ఇవ్వాలని రాష్ట్ర డీజీపీని జాతీయ మహి ళా కమిషన్ ఆదేశించింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన వేర్వేరు వీడియోల ను ఉద్దేశించి ఈ మేరకు డీజీపీకి లేఖ రాసిం ది. ఈ ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. దేశం విడిచి వెళ్లిన ప్రజ్వల్‌ను పట్టుకునేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది. ఫిర్యాదు అందిన తర్వాత కూడా నిందితుడిని అరెస్ట్ చేయకుండా విదేశాలకు ఎలా వెళ్లనిచ్చారని, ఇందులో పోలీ సుల ప్రమేయం ఉందా అని ప్రశ్నించింది. 

సత్యమే గెలుస్తుంది.. 

అశ్లీల వీడియోలు, లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్ రేవణ్ణ ఎట్టకేలకు స్పందించారు. విచారణకు రావాలని సిట్ ఆదేశించిన నేపథ్యంలో ట్విట్టర్ ఎక్స్‌లో ఓ పోస్టు చేశాడు. విచారణకు హాజరయ్యేందుకు తాను బెంగళూరులో లేనని, ఇదే విషయాన్ని తన న్యాయవాది ద్వారా బెంగళూరు సీఐడీకి సమాచారం అందించానని పేర్కొన్నారు. సత్యం ఎప్పటికైనా గెలుస్తుందని ఆయన కామెంట్ చేశారు.