12-11-2025 12:00:00 AM
వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు
కొద్దిసేపట్లోనే పోలీసుల రంగ ప్రవేశం : అరెస్టు
కాటారం, నవంబర్ 11 (విజయక్రాంతి) : సబ్ డివిజన్ పరిధిలోని కాటారం, మహాదేవపూర్, పలిమల, మహా ముత్తారం, మల్హర్ మండలాలలో ప్రజాసంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల కోసం 500 కోట్ల రూపాయల నిధులను సమకూర్చాలని వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ మంగళవారం కాటారం మండల కేంద్రమైన గారేపల్లి చౌరస్తాలో నిరవధిక నిరాహార దీక్షకు పూనుకుంది. కాగా కొద్దిసేపట్లోనే పోలీసులు రంగ ప్రవేశం చేసి, నిరాహార దీక్ష చేస్తున్న ఆందోళనకారులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.
ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఆతుకూరి శ్రీకాంత్ మాట్లాడుతూ ఐదు మండలాలలో దశాబ్దాలుగా అభివృద్ధి అంతంత మాత్రమే జరిగిందని, పాలకులు నిర్లక్ష్య వైఖరి వల్ల అభివృద్ధికి ఆమడ దూరంలో ప్రజల పరిస్థితి ఉందని అన్నారు. తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం, డివైఎఫ్ఐ, కెవిపిఎస్, డిఎస్పి, బీసీ, ఎస్టీ, డి.ఎస్.పి, టిడిపి, టిఆర్ఎస్ పార్టీలు మద్దతు ఇచ్చాయని శ్రీకాంత్ తెలిపారు. పోలీసులు దీక్షను భగ్నం చేసి అక్రమంగా అరెస్టు చేయడాన్ని వారు ఖండించారు.
న్యాయమైన డిమాండ్లు నెరవేర్చకపోతే మంత్రి ఇల్లు ముట్టడికి సిద్ధమవుతామని, భవిష్యత్తు కార్యాచరణ చేపడతామని అన్నారు. తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి పోలం రాజేందర్, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు వంగల లక్ష్మి ,డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి భూక్య నవీన్, యంగ్ ఉమెన్స్ జిల్లా కన్వీనర్ బందు సుజాత, కో కన్వీనర్ బుర్ర స్వాతి, కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి ఆత్కూరు శ్రీధర్, డివైఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యురాలు బుర్ర శృతి తదితరులు పాల్గొన్నారు.