17 August, 2026 | 5:07 AM

వ్యాపార లావాదేవీల నేపథ్యంలో వ్యక్తి కిడ్నాప్

17-06-2024 12:42 AM
  • రౌడీషీటర్లతో కలిసి వ్యాపార భాగస్వామి పథకం

హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 16 (విజయక్రాంతి): ఇద్దరు వ్యాపార భాగస్వాము ల ఆర్థిక లావాదేవీల గొడవలు చివరికి కిడ్నాప్ చేసే వరకు వెళ్లింది. ఎస్వోటీ పోలీసులమంటూ చెప్పి ఓ కంపెనీ ఎండీతో పాటు సేల్స్ కోఆర్డినేటర్‌ను దుండగులు కిడ్నాప్ చేశారు. ఈ ఘటన గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గచ్చిబౌలి డీఎల్‌ఎఫ్‌లో సాయిగుప్తా అనే వ్యాపారి కిక్ స్టార్ట్ పేరుతో సాఫ్ట్‌వేర్ కంపెనీ నిర్వహిస్తున్నాడు. గతంలో అతడితో వ్యాపార భాగస్వామిగా ఉన్న గౌతమ్ బవిరిశెట్టితో ఆర్థిక లావాదేవీల విషయమై కొన్నాళ్లుగా  వివాదాలు ఉన్నాయి.

దీంతో గౌతమ్ ప్రణాళిక ప్రకారం సాయిగుప్తా కిడ్నాప్‌కు ప్లాన్ చేశాడు. శుక్రవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో సాయిగుప్తా కారులో వెళుతుండగా, దుండగులు రెండు కార్లలో వచ్చి సాయిగుప్తా కారును ఢీకొట్టా రు. అనంతరం తాము ఎస్వోటీ పోలీసులమని చెప్పి సాయిగుప్తాతో పాటు అతడితో ఉన్న సేల్స్ కోఆఆర్డినేటర్‌ను కిడ్నాప్ చేశారు. వారిని మొదట జగద్గిరిగుట్టలోని ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లారు. అక్కడ రాత్రి ఒంటి గంట వరకు ఇద్దరిపై దాడి చేశా రు. చంపేస్తామంటూ బెదిరించారు. కుటుంబసభ్యులతో మాట్లాడి వెంటనే రూ.కోట్లు తెప్పించాలని డిమాండ్ చేశారు.

మరోవైపు సాయిగుప్తా కుటుంబ సభ్యులు గచ్చిబౌలి పోలీసులను ఆశ్రయించి అతడి కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. పోలీసు లు పట్టుకుంటారన్న భయంతో దుండగులు ఖాళీ బాండ్ పేపర్లపై సాయిగుప్తాతో పాటు కోనఆర్డినేటర్‌తో సంతకాలు చేయించుకుని, అనంతరం వారిద్దరినీ వికారాబాద్‌లో వదిలి పారిపోయారు. కిడ్నాప్ వ్యవహారంలో గౌతమ్‌తో పాటు మరో 13 మంది రౌడీషీటర్లకు ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. గౌతమ్‌ను ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకోగా, ఉండగా మిగతా నిందితులు పరారీలో ఉన్నట్లు సమాచారం. కేసు విషయంలో గచ్చిబౌలి పోలీసులు గోప్యతం పాటిస్తుండం అనేక అనుమానాలకు తావిస్తోంది.