23-11-2025 08:01:38 PM
హనుమకొండ టౌన్ (విజయక్రాంతి): తెలంగాణ టీచర్స్ అండ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆఫ్ మోడల్ స్కూల్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం హనుమకొండలోని పబ్లిక్ గార్డెన్ లో ఆదివారం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి హాజరైన ఉపాధ్యాయులు కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో టీజీటీఈఏఎం రాష్ట్ర అధ్యక్షులుగా రేచవేని కిరణ్ కుమార్, జనరల్ సెక్రెటరీగా కట్కూరి మహేందర్, కోశాధికారిగా ఎడ్ల రమేష్, అధికార ప్రతినిధిగా ఎండి అన్వర్, ప్రతి జిల్లా నుండి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎన్నుకున్నారు.
అనంతరం రాష్ట్ర అధ్యక్షులు కిరణ్ కుమార్ మాట్లాడుతూ మోడల్ స్కూల్స్ ను తక్షణమే పాఠశాల విద్యాశాఖలో విలీనం చేసి ఉపాధ్యాయులందరికీ 010 ద్వారా వేతనాలు చెల్లించాలని, రెండవ దశలో నియమించబడిన ఉపాధ్యాయులకు వెంటనే సర్వీస్ రక్షణ, నోషనల్ బెనిఫిట్స్ కల్పించాలని, దానితో పాటు మోడల్ స్కూల్లో మిగిలిన అన్ని సమస్యలు త్వరతగిరిన పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తనపై నమ్మకంతో రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు మోడల్ స్కూల్ ఉపాధ్యాయులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు గోపగాని విక్రమ్, మహిళ విభాగం అధ్యక్షురాలు రుద్రమదేవి, మహిళ ఉపాధ్యక్షురాలు శశి కుమారి, ట్రెజరర్ ఎడ్ల రమేష్, కార్యవర్గ సభ్యులు, వివిధ జిల్లాల నుండి విచ్చేసిన ఉపాధ్యాయులు పాల్గొన్నారు.