16-04-2025 01:23:57 AM
హైదరాబాద్, ఏప్రిల్ 15 (విజయక్రాంతి) : రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఎక్కువనేది అందరికీ తెలిసిన విషయమే అని పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ చెపుతుంటారు. రాష్ట్ర మంత్రివర్గాన్ని రేపో మాపో విస్తరిస్తారన్న వార్తల నేపథ్యంలో కొందరు కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య మాటల తూటాలు పేలడం మొదలైంది.
మంత్రివర్గ విస్తరణ కొలిక్కి రాకపోవడంతో.. అమాత్య పదవి కోసం ఎదురుచూస్తున్న ఆశావహులకు ఓపిక నశించింది. అసహనంతో కొందరు నేతలు భిన్న స్వరాలు వినిపిస్తున్నారు. మంత్రివర్గ విస్తరణ మరింత వాయిదా పడుతుండటంతో సమస్య క్లిష్టతరమవుతోంది. ఇక పదవి రాదనుకున్నారో.. తమకు రానిస్తలేరని అనుకుంటున్నారో గానీ అమాత్య పదవి ఆశిస్తున్న వారు సొంత పార్టీ నేతలనే టార్గెట్ చేస్తున్నారు.
పదవి రానిస్తలేరని ఒకరు.. కష్టకాలంలో పార్టీని అంటిపెట్టుకుని ఉన్న వారికి కాకుండా, పార్టీలు మారి వచ్చిన వారికి అవకాశం ఇస్తున్నారని చెబుతున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చాక ఏడాదిన్నర కాలం వరకు గుంభనంగా నడుస్తున్న కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం తాజా పరిణామాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నది.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాతో పాటు హైదరాబాద్కు మంత్రివర్గంలో చోటు కల్పించాలని పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి ఢిల్లీ పెద్దలకు రాసిన లేఖ కూడా రాష్ట్ర కాంగ్రెస్లో నిప్పు రాజేసింది. తాను హోంమంత్రినని పలు సందర్భాల్లో చెప్పుకున్న మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి బహిరంగంగానే బయటపడ్డారు.
నల్లగొండ జిల్లాకు చెందిన జానారెడ్డి.. అదే జిల్లాకు చెందిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి చెక్ పెట్టేందుకే ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు కు మంత్రివర్గ విస్తరణలో అవకాశం కల్పంచాలని, అందులో ప్రధానంగా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డికి మద్దతుగానే లేఖ రాశారనే చర్చ జరుగుతోంది.
ఇప్పటికే కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మంత్రిగా ఉండగా, ఆయన సోదరుడు రాజగోపాల్రెడ్డికి మం త్రి పదవి ఇస్తే.. జిల్లాలో వారికి అడ్డుకట్ట వేయలేమని ఆలోచనతో ఉన్నట్లుగా చర్చ జరుగుతోంది. అంతేకాకుండా జానారెడ్డి ఇద్దరు కుమారుల్లో ఒకరు నాగార్జునసాగర్ ఎమ్మెల్యే, మరొకరు నల్లగొండ ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
ఈ సమయం లో రాజగోపాల్రెడ్డికి మంత్రిగా అవకాశం వస్తే.. జానారెడ్డి తనయులకు రాజకీయంగా ఇబ్బంది మారుతుందని అభిప్రాయంతోనే అధిష్ఠానానికి లేఖ రాశారని సమాచారం. ఇక ఉమ్మడి అదిలాబాద్ జిల్లా విషయానికొ స్తే మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు కూడా మంత్రి పదవిని ఆశిస్తున్నారు.
అదే జిల్లాకు చెందిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పేరు మంత్రివర్గ విస్తరణలో వినిపిస్తుండటంతో ప్రేమ్సాగర్రావు బాహాటంగానే మండిపడుతున్నారు. ఈ పరిస్థితు ల్లో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్గా కొత్తగా బాధ్యతలు స్వీకరించిన మీనాక్షి నటరాజన్ మంత్రి పదవుల అంశంపై ఎలా స్పందిస్తారనేది ఆసక్తిగా నెలకొన్నది. ఎందుకంటే పార్టీ విషయాలు బయట మాట్లా డొద్దని, ఏమైనా సమస్యలుంటే తనకే చెప్పాలని ఆదేశించిన విషయం తెలిసిందే.
జానారెడ్డి దృతరాష్ర్టుడి పాత్ర పోషిస్తున్నాడు: రాజగోపాల్రెడ్డి
‘నాకు మంత్రి పదవి రాకుండా కొందరు ఢిల్లీ స్థాయిలో కుట్రలకు తెరలేపారు. నాకు వచ్చే మంత్రి పదవి విషయంలో ధర్మరాజులా ఉండాల్సిన జిల్లా నేత జానారెడ్డి ధృత రాష్ర్టుడి పాత్రను పోషిస్తున్నారు. నాకు మంత్రి పదవి ఖాయమైనా జానారెడ్డి కావాలనే పదేపదే అడ్డుపడుతున్నారు. 25 ఏళ్లు మంత్రి పదవిలో ఉన్నది జానారెడ్డికి సరిపోదా?. పార్టీ అధిష్ఠానం నాపై నమ్మకం ఉం చి మంత్రి పదవి ఇస్తే.. దానిని బాధ్యతగా భావిస్తాను.
మంత్రి పదవి కోసం తానెప్పు డు అడ్డుక్కోలేదు.. అన్నదమ్ములు మంత్రులుగా ఉంటే తప్పేంటి..? సమర్థత ఉన్న నాయకులకే మంత్రి పదవులు ఇవ్వాలి. పదవి అనేది అలంకారం, కిరీటం కాదు, ఒక బాధ్యత. ఆ బాధ్యతను గుర్తించి ప్రజలకు మంచి చేయాలి. పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి సీటును గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తాన ని పార్టీ హామీ ఇచ్చింది’ అని రాజగోపాల్రెడ్డి అన్నారు.
పార్టీలు తిరిగొచ్చిన వారికి మంత్రి పదవి ఎలా ఇస్తారు: ప్రేమ్సాగర్రావు
పార్టీలో తాను సీనియర్ నాయకుడని, పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జిల్లాలో పార్టీని, కేడర్ను కాపాడుకున్నాను అని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ పార్టీకి హెచ్చరికనే చేశారు. రాష్ట్రంలో పార్టీని బతికించిన వాళ్లలో తాను కూడా మొదటి వరస లో ఉంటాను. ఇలాంటి సమంలో నాకు కాకుండా అనేక పార్టీలు తిరిగొచ్చిన వారు కూడా ఇప్పుదు పదవుల కోసం మాట్లాడం సరికాదు.
ఎన్నికల ముందు వచ్చిన వారికి అమాత్య పదవి ఇస్తే ఊరుకునేది లేదు’ అని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిని ఉద్దేశించి ఘాటుగానే స్పందించారు. బీఆర్ఎస్ వల్ల పడిపోయిన కాంగ్రెస్ పార్టీకి ఇం ద్రవెళ్లి సభతో నేను ఊపిరిపోశాను. ఆదివాసీలకకు, పార్టీ కార్యకర్తలకు ఊపిరిగా నిలిచా ను. పదేళ్లు పార్టీని కాపాడుకుంటూ వస్తే.. నా కు అన్యాయం చేస్తారా?’ అని చెబుతున్నారు.
పార్టీలో వీహెచ్ తర్వాత నేనే సీనియర్ను: జీవన్రెడ్డి
కాంగ్రెస్ను వీడుతున్నట్లు వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని, అవన్నీ ఊహాగానా లేనని మాజీమంత్రి జీవన్రెడ్డి కొట్టిపారేశా రు. ‘జిల్లాలో దశాబ్ద కాలంగా ఒంటరిగా పో రాటం చేశా. కాంగ్రెస్ అంటే జీవన్రెడ్డి అనే లా పార్టీ బలోపేతానికి కృషి చేశా. కాంగ్రెస్లో వీ హనుమంతరావు తర్వాత నేనే సీని యర్ను. జానారెడ్డి కూడా నా కంటే నాలుగేళ్ల తర్వాత పార్టీలోకి వచ్చారు. పార్టీలో సీనియార్టీకి స్థానం ఏమిటనే బాధనాలో ఉ ంది’ అని జీవన్రెడ్డి వ్యాఖ్యానించారు.