17-01-2026 05:04:29 PM
కొంతమందికి ఆశ మరి కొంతమందికి నిరాశ మిగిల్చిన రిజర్వేషన్లు
కోదాడ: కోదాడ మున్సిపల్ పీఠం ముచ్చటగా మూడోసారి జనరల్ మహిళకు రిజర్వ్ అయింది. శనివారం సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఆధ్వర్యంలో నిర్వహించిన పవర్ డ్రా ద్వారా 35 వార్డులకు సంబంధించిన రిజర్వేషన్లను అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రకటనతో కోదాడ రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.రిజర్వేషన్ల ఖరారుతో ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నేతలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు.
ఏ వార్డు ఎవరికి అనుకూలం? ఎక్కడ కొత్త ముఖాలకు అవకాశం? ఎక్కడ సీనియర్ నేతలకు దెబ్బ? అన్న అంశాలపై పార్టీల్లో అంతర్గత చర్చలు మొదలయ్యాయి. కోదాడ మునిసిపాలిటీలో మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువ ఉండడంతో ఎక్కువ వార్డులు మహిళలకు కేటాయించబడ్డాయి. ఈ రిజర్వేషన్లతో కోదాడ మున్సిపల్ ఎన్నికలు ఆసక్తికరంగా మారనున్నాయి. ఇప్పటికే ఆశావహులు తమ తమ వార్డుల్లో ప్రచారానికి సిద్ధమవుతుండగా, పార్టీ టికెట్ల కోసం పోటీ తీవ్రంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. రిజర్వేషన్లు ఎవరి రాజకీయ భవితవ్యాన్ని మార్చనున్నాయో అన్న చర్చలు కోదాడలో హాట్ టాపిక్గా మారాయి.