1969 ఉద్యమానికి ఆద్యుడు ‘కొలిశెట్టి’ కన్నుమూత
హైదరాబాద్, మే 14 (విజయక్రాంతి)/భద్రాద్రి కొత్తగూడెం: తొలి తెలంగాణ ఉద్యమానికి ఆద్యుడు, మార్గదర్శి కొలిశెట్టి రామ్దాసు(82) హైదరాబాద్లోని ఆయన నివాసంలో (82) మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన స్వగ్రా మం ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం గేటుకారేపల్లి. విద్యార్థి దశలోనే రామ్దాసు అనేక విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొన్నారు. విశాలాంధ్ర నినాదాన్ని 1954 వ్యతిరేకించారు. ఆది నుంచి ఆయన ఆంధ్రా అధిపత్య ధోరణికి వ్యతిరేకి. ప్రత్యేక తెలంగాణ కోసం 1969లో ఆయన విద్యార్థులు, ఉద్యోగులు, కార్మికులను ఏకంగా చేశారు.
ఖమ్మంలో నాటి డిగ్రీ విద్యార్థి రవీంద్రనాథ్తో రెండు వారాలపాటు ఆమరణ నిరాహార దీక్ష చేయించిన మార్గదర్శి ఆయన. రామ్దాసు తెలంగాణ ప్రాంతీయ సమితిని ఏర్పాటు చేసి, ఆ సంఘానికి అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఇల్లెందు కేంద్రంగా తన అనుచరులతో కలిసి ఉద్యోగాల నియామకాల్లో తెలంగాణ ప్రాంతంపై జరుగుతన్న వివక్షపై గణాంకాలు బయటపెట్టారు. తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాయాన్ని ఎండగట్టారు. ‘నాన్ ముల్కీ గో బ్యాక్‘ అంటూ నినదించి ఉద్యమకారులను ఏకం చేశారు. ఆ తర్వాతి కాలంలో రామ్దాసు సింగరేణి కాలరీస్లో ఉద్యోగాన్ని సాధించారు.
అన్నివిధాలా అర్హుడైనప్పటికీ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమకారుడిగా ముద్రపడడంతో ఆయనకు ఉద్యోగోన్నతులు రాలేదు. అయి నప్పటికీ ఆయన తెలంగాణ ఉద్యోగులు, యువతకు జరుగుతున్న వివక్షపై గొంతెత్తారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఊపిరి లూదారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యమ నేత, నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కసారైనా రామ్దాసు గురించి ఆరా తీయలేదు. రామ్దాసు ఎక్కడ ఉన్నారో, ఏ స్థితిలో ఉన్నారో పట్టించుకోలేదు. రామ్దాసు ఉద్యమ గాథ గురించి తెలుసుకున్న అప్పటి గవర్నర్ తమిళిసై సౌంద ర్యరాజన్ ఆయన కుటుంబ సభ్యులను కలిశారు. రామ్దాసు పెద్దకుమారుడిని ప్రత్యేకంగా సన్మానించారు. మృతుడు రామ్దాసుకు కుమారులు మాదవ్, రాఘువీర్, కుమార్తెలు శ్రీదేవి, మాధవి, శ్రీలత ఉన్నారు.




