30-06-2025 04:50:09 PM
సీఐటియు జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్..
దండేపల్లి (విజయక్రాంతి): జి.ఓ.నెం.49 "కొమురం భీం కన్జర్వేషన్ రిజర్వ్" ను రద్దు చేయాలని సీఐటియు జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్(CITU District Secretary Dumpala Ranjith Kumar) అన్నారు. సోమవారం తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కోయపోచంగూడెంలో షెడ్యూల్ ప్రాంత హక్కులను కాలరాస్తూ ఆదివాసీలను అడవికి దూరం చేసే విధంగా ఉన్న జిఓ 49ను తక్షణమే రద్దు చేయాలనీ ప్లే కార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా టిఏజిఎస్ సంఘం నాయకులు మాట్లాడాతూ... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2025 మే 30న తాడోబా అందేరి రిజర్వ్ ఫారెస్ట్ను కవ్వాల్ రిజర్వ్ ఫారెస్ట్ కలుపుతూ కొమురం భీం జిల్లాలోని కాగజ్నగర్- ఆసిఫాబాద్ పరిధిలో 334 గ్రామాలను గజిట్లో పేర్కొంటూ తీసుకొచ్చిన "జి.ఓ నెం.49 కొమురం భీం కన్జర్వేషన్ రిజర్వ్" ప్రాజెక్ట్ను రద్దు చేయాలని కోరారు.
ఈ ప్రాంతం భారత రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ ప్రాంతంలో ఉందన్నారు. ఇక్కడ గ్రామ సభ, పెసా లాంటి గిరిజన చట్టాలను అమలు పర్చకుండా ఈ గ్రామాల్లో ఎలాంటి సభలు నిర్వహించకుండా ప్రజాభిప్రాయలు తీసుకోలేదు. ఇక్కడ ఈ రిజర్వ్ ఫారెస్ట్ చేపడుతున్న సందర్భంగా ప్రభుత్వం నుండి మంజూరైన ఇందిరమ్మ ఇండ్లు, త్రీ ఫేజ్ కరెంట్, ఇతర సదుపాయాలు అన్ని ఫారెస్ట్ అధికారులు ఆపేసారన్నారు. ఈ జి.ఓ నెం. 49 ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా ఉన్నందున ఈ జి.ఓ. 49ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు ఎల్లయ్య, రమేష్, పోశం, పోసవ్వ, మల్లవ్వ, రాజలింగు తదితరులు పాల్గొన్నారు.