calender_icon.png 25 September, 2025 | 12:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొంపెల్లి వెంకట్ గౌడ్ మృతిపట్ల కేటీఆర్ సంతాపం

25-09-2025 11:12:23 AM

కొంపెల్లి వెంకట్ హఠాన్మరణం.. తెలంగాణ సాహిత్య రంగానికి తీరని లోటు

హైదరాబాద్: ప్రముఖ రచయిత, తెలంగాణ వాది కొంపల్లి వెంకట్ గౌడ్(Kompelli Venkat Goud) మృతి పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) సంతాపం తెలిపారు. ప్రముఖ రచయిత, తెలంగాణ మట్టిబిడ్డ కొంపెల్లి వెంకట్ గౌడ్ ఇక లేరన్న వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని కేటీఆర్ పేర్కొన్నారు. ఆయన హఠాన్మరణం తెలంగాణ సాహిత్య రంగానికి, తెలంగాణ ప్రజలకు తీరని లోటు అన్నారు. వెంకట్ గౌడ్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు కేటీఆర్ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రొఫెసర్ జయశంకర్ జీవితాన్ని, అనుభవాలను "వొడువని ముచ్చట"గా తెలంగాణ ప్రజలకు అందించిన వెంకట్ మరోవైపు ఆర్. విద్యాసాగర్ రావు ఆలోచనలను "నీళ్ల ముచ్చట"గా పుస్తక రూపంలోకి తీసుకొచ్చి ఇద్దరు మహానుభావుల ఆలోచనలను శాశ్వతంగా పదిల పరిచారని కొనియాడారు.

వీరితో పాటు ప్రముఖ సాహితీవేత్త నోముల సత్యనారాయణ వంటి ప్రముఖుల జీవితాలను కూడా గ్రంథస్తం చేశారని చెప్పారు. తన జీవితకాలం ఆద్యంతం తెలంగాణ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కొంపల్లి వెంకట్ గౌడ్ పోషించిన పాత్ర అద్వితీయమన్నారు. అంతే కాకుండా, తన రచనల ద్వారా బడుగు బలహీన వర్గాలకు అన్ని విధాలుగా అభ్యున్నతి కలగాలన్నఆలోచన విధానంతో తన సాహిత్య జీవితాన్ని సాగించారని వెల్లడించారు. గౌడన్నల ఆత్మగౌరవాన్ని చాటి చెప్పి, సర్వాయి పాపన్న చరిత్రను అక్షరబద్ధం చేసి ఈ తరానికి అందించారని చెప్పిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ తత్వం, ఉద్యమ స్ఫూర్తిని తన కలంలో నింపుకొని ఎన్నో రచనలు చేసిన ఆయన కృషి చిరస్మరణీయం అన్నారు. కొంపెల్లి వెంకట్ గౌడ్ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు ఈ దుఃఖాన్ని తట్టుకునే శక్తిని ప్రసాదించాలని కేటీఆర్ భగవంతుడిని ప్రార్థించారు.