5 June, 2026 | 12:52 AM

చార్మినార్ వద్ద కేటీఆర్ సందడి

05-06-2026 12:03 AM

నిమ్రా కేఫ్‌లో ఇరానీ చాయ్, ఉస్మానియా బిస్కెట్ల రుచి చూసిన 

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్

హైదరాబాద్, జూన్ 4 (విజయక్రాంతి): హైదరాబాద్ పాతబస్తీ సంస్కృతికి అద్దం పట్టే ఇరానీ చాయ్ రుచిని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆస్వాదించారు. పాతబస్తీ పర్యటనకు వెళ్లిన ఆయన చార్మినార్కు ఆనుకుని ఉండే ప్రసిద్ధ ’నిమ్రా కేఫ్ అండ్ బేకరీ’ని గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా కేటీఆర్ ట్విట్టర్ (ఎక్స్) వేదికగా స్పందిస్తూ.. ‘హైదరాబాద్ పాతబస్తీకి వెళ్లినప్పుడు అక్కడి ఇరానీ చాయ్ తాగకపోతే ఆ పర్యటనకు సంపూర్ణత్వమే ఉండదు.

చార్మినార్ పక్కనే ఉన్న ప్రముఖ నిమ్రా కేఫ్ను సందర్శించి, ఇక్కడి రుచికరమైన ఉస్మానియా బిస్కెట్లు, ఇరానీ చాయ్ని ఆస్వాదించాను‘ అని పేర్కొన్నారు. కేఫ్ సందర్శనకు వచ్చిన కేటీఆర్కు నిమ్రా బేకరీ అధినేత, యువ పారిశ్రామికవేత్త అస్లాం బిన్ అబూద్ సాదర స్వాగతం పలికారు. తమకు ఎంతో ఆప్యాయంగా ఆతిథ్యం ఇచ్చినందుకు అస్లాం బిన్ అబూద్తో పాటు కేఫ్ సిబ్బంది అందరికీ కేటీఆర్ ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కేటీఆర్ పాతబస్తీ రాకతో చార్మినార్ పరిసర ప్రాంతాల్లో సందడి నెలకొంది.