calender_icon.png 18 June, 2025 | 5:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పీసీసీ చీఫ్‌కు కేటీఆర్ నోటీసులు

18-06-2025 12:15:19 AM

  1. సాక్ష్యాలు లేకుండా తనపై ఎలా ఆరోపణలు చేస్తారని అభ్యంతరం
  2. బేషరతుగా తనకు క్షమాపణ చెప్పాలని డిమాండ్
  3. ప్రభుత్వ వైఫుల్యాలను కప్పిపుచ్చుకునేందుకే తనపై వ్యాఖ్యలని మండిపాటు

హైదరాబాద్, జూన్ 17 (విజయక్రాంతి): ఫోన్‌ట్యాపింగ్ పేరిట తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూటీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్‌కు మంగళవారం బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. ఈ మేరకు కేటీఆర్ పత్రికా ప్రకటనను విడుదల చేశారు. లేనిపో ని హామీలతో అధికార పగ్గాలు చేపట్టిన కాం గ్రెస్ సర్కార్  ఆ తర్వాత హమీల సంగతిని పక్కన పెట్టిందని కేటీఆర్ పేర్కొన్నారు.

తమ చేతగానితనాన్ని కప్పిపుచ్చేందుకే  పీసీసీ చీఫ్, ఆ పార్టీ నేతలు ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చి రాద్ధాంతం చేస్తున్నారని ఆరోపించారు. ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా తనపై, తమ పార్టీ నేతలపై ఫోన్‌ట్యాపింగ్ చేశారని ఎలా వ్యాఖ్యలు చేస్తారని ప్రశ్నించారు. ఈవిషయంలో పీసీసీ చీఫ్ బేషరతుగా తమకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

చట్టాలను గౌరవించే వ్యక్తులుగా తాము అన్ని కేసులను ఎదుర్కొంటున్నామని, విచారణ అధికారులకు సహకరిస్తున్నామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఆరు గ్యారెంటీలను గాలికొదలేసి, ప్రజాసంక్షేమాన్ని పక్కనపెట్టి బీఆర్‌ఎస్ నేతలను టార్గెట్ చేస్తున్నదని దుయ్యబట్టారు.

కాంగ్రెస్ నేతలకు ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదని హెచ్చరిం చారు.  స్థానిక ఎన్నికల్లో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే బీఆర్‌ఎస్‌పై బురద చల్లుతున్నారని మండిపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డి,  పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ అబద్ధాలు వల్లె వేయడంలో పోటీ పడుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో డైవర్షన్ రాజకీయాలకు తెరతీశారన్నారు.