ఫార్ములా-ఈ కార్ రేసింగ్ కేసుపై స్పందించిన కేటీఆర్
హైదరాబాద్,(విజయక్రాంతి): హైదరాబాద్లో జరిగిన ఫార్ములా-ఈ కార్ రేసింగ్ కుంభకోణంలో నమోదైన కేసుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు స్పందించారు. ఈ కార్ రేస్ లో కుంభకోణం జరిగిందని అంటున్నారు కాదా, అయితే శాసనసభలో చర్చ పెట్టండి అని కేటీఆర్ అన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సభలో చర్య పెట్టాలని సవాల్ చేశారు. ఫార్ములా-ఈ కార్ రేసుపై అన్ని వాస్తవాలు వివరిస్తాను అని కేటీఆర్ పేర్కొన్నారు. కేటీఆర్ పై నమోదైన కేసు అంశంపై అసెంబ్లీలో హరీశ్ రావు ప్రస్తావించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దబాయిస్తున్నారు, అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ఫార్ములా-ఈ కార్ రేసింగ్ తో ప్రపంచ వ్యాప్తంగా రాష్ట్రం, హైదరాబాద్ ఇమేజ్ కోసం ప్రయత్నం చేసిన కేటీఆర్ పై అక్రమ కేసులు పెట్టారు అని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన కేసు నిజమే అయితే, దమ్ముంటే అసెంబ్లీలో చర్చ పెట్టాలని హరీశ్ రావు సవాల్ విసిరారు.
ఫార్ములా-ఈ కార్ రేసింగ్ లో విదేశీ సంస్థకు నగదు చెల్లింపు వ్యవహారం వివాదాస్పదంగా మారింది. హెచ్ఎండీఏ బోర్డు, ఆర్థికశాఖ, ఆర్బీఐ అనుమతి లేకుండానే రూ.55 కోట్లు చెల్లంపులు జరిగాయని, రూ.46 కోట్ల వరకు డాలర్ల రూపంలో చెల్లించారనేది ప్రధాన అభియోగం. ఫార్ములా-ఈ కార్ రేసులో కేటీఆర్ ను ఏ1గా, ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్ ను ఏ2గా, హెచ్ఎండీఏ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డి ఏ3గా ఉన్నారు. ఈ కార్ రేసింగ్ కుంభకోణంపై అవినీతి నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదైనట్లు సమాచారం. కేటీఆర్ పై విచారణ జరిపేందుకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఇటీవల అనుమతించారు. గవర్నర్ అనుమతితో తదుపరి చర్యలకు తెలంగాణ సర్కారు ఉపక్రమించగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి విచారణ చేపట్టాలని ఏసీబీకి మొన్న లేఖ రాశారు.






